ఫోర్ట్ విలియం అనేది కలకత్తాలో హుగ్లీ నది ఒడ్డున బ్రిటిష్ వాళ్లు భారతదేశాన్ని పాలిస్తున్న కాలంలో నిర్మించిన కోట. దీన్ని బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వాళ్లు 1781లో నిర్మించారు. ఇంగ్లండ్ రాజు మూడో విలియం పేరు మీద దీనిని ఫోర్ట్ విలియం అని పిలిచేవారు. అయితే ఫోర్ట్ విలియం పేరుతో అక్కడ రెండు కోటలు నిర్మించారు. 1706లోనే అక్కడ ఒక కోటని నిర్మించారు. దాని నిర్మాణాన్ని సర్ చార్లెస్ ఐర్ ప్రారంభించగా జాన్ బియర్డ్ పూర్తి చేశారు. 1756లో బెంగాల్ నవాబు సిరాజుద్దౌలా ఆ కోట మీద దాడి చేసి ఆక్రమించుకున్నాడు. దానితో బ్రిటీష్ వారు మరో కొత్తకోట నిర్మించాలనుకున్నారు. 1757లో జరిగిన ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు. ఆ తర్వాత బ్రిటిష్ అధికారి రాబర్ట్ క్లైవ్ ఆధ్వర్యంలో కొత్త ఫోర్ట్ విలియం నిర్మాణం ప్రారంభమైంది. ఫోర్ట్ విలియం నిర్మాణాన్ని 1758లో మొదలు పెడితే 1781 నాటికి పూర్తయింది.