హారు చిన్నారులూ...ఎగ్జామ్స్ దగ్గరపడుతున్నారు కదూ... మరి మీరు సిద్ధమేనా..? అంతా చదివేసారా... ఎలా చదవాలో.. ఏం చదవాలో తెలియకపోతే ఇలా చేయండి.. సరియైన ప్రణాళికను రూపొందించుకుని, వేళకి సరియైన ఆహారం తీసుకుంటూ చదివితే పరీక్షలకి భయపడాల్సిన అవసరం ఉండదు.
- రోజుకు 24 గంటలు కదా! నిద్రకు 8 పోను 16 గంటలు మిగులుతాయి. వీటిని సక్రమంగా వినియోగించుకోవాలి. కానీ మనం చదవాల్సిన సమయంలో టీవీలనీ, ఆటలనీ, సమయాన్నంతా వృథా చేసేస్తున్నాం. ఆడుకోవాల్సిన టైంలో ఆడుకోవాలి. చదువుకోవాల్సిన టైంలో చదువుకోవాలి. కాలాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలియక పరీక్షలప్పుడు కంగారుపడి సరిగ్గా రాయలేకపోతున్నాం. అందుకే టైం మేనేజ్మెంట్ తెలిసుండాలి.
- ప్రణాళిక లేకపోవడం, ప్రతికూల ఆలోచనలు, క్రమశిక్షణా రాహిత్యం, బద్ధకం, పట్టుదల లేకపోవడం ఇవన్నీ కూడా పరీక్షలు సరిగా రాయకపోవడానికి కారణాలు. అయితే వీటిని అధిగమిస్తే చాలు సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. అన్నది సాధించవచ్చు.
- ఇందుకోసం ఏం చేయాలంటే మీకు ఈ నెల చివర్లో కదా పరీక్షలు... కాబట్టి మీకున్నది చాలా తక్కువ సమయం. ఈ సమయాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి. అందుకోసం ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. అది ఎలాగంటే... ఒక పుస్తకం తీసుకుని అందులో సబ్జెక్టు పేరు, ఛాప్టర్ పేరు, సమయం రాసి భాగాలుగా విభజించుకోవాలి. ఉదాహరణకు మీకు ఏడు సబ్జెక్టులు ఉన్నాయనుకుంటే... వారంలో రోజుకొక సబ్జెక్టు కేటాయించుకుని, ఏడు రోజుల్లో ఏడు సబ్జెక్టులు చదివేలా ప్రణాళిక వేసుకోవాలి. అంతేకాక రోజులో ఒక్కో ఛాప్టర్కు ఇన్నేసి గంటలు అని సమయం విభజించుకోవాలి. ఇలా ప్రణాళికతో చదివితే పరీక్షల్లో మంచి మార్కులు సాధించగలం. అయితే ప్రణాళిక వేసుకుంటేనే సరిపోదు. దానిని సక్రమంగా అమలుపరచాలి.
అందుకోసం ఈ జాగ్రత్తలు కూడా తీసుకోవాలి.
- పాఠ్యాంశం చదువుతున్నప్పుడు మధ్యలో ఏవైనా సందేహాలు వస్తే... అవి ఎర్ర సిరాతో గుర్తు పెట్టుకుని బడిలో టీచర్ను అడిగితెలుసుకోవాలి. ముఖ్యమైన పాయింట్లను ప్రత్యేక నోట్బుక్లోరాసుకోవాలి. అలా అని పాఠమంతా రాయకూడదు. పాఠానికి ఒక్క పేజీ మించకూడదు.
- రోజూవారీ పాఠాలను చదవడం, హోం వర్క్ చెయ్యడం వంటివి ఉంటాయి. వాటికి ఇబ్బంది లేకుండా సమయాన్ని కేటాయించుకోవాలి. తెల్లవారుజామునే లేచి చదివితే చాలా మంచిది. ఆ సమయంలో మెదడు చాలా శక్తిమంతంగా ఉంటుంది. ఇలా కాలాన్ని సద్వినియోగపరుచుకుంటూ చదివితే విజయం మీదే..!
- మరి చదవాలంటే శక్తి కావాలి కదా.. ఏ ఆహారం తీసుకోవాలో చూద్దామా..
- ఉదయం నిద్రలేవగానే గ్లాసుడు గోరువెచ్చని నీళ్లు కానీ పాలు కానీ తాగండి. అంతేకానీ ఎనర్జీ డ్రింక్స్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు.
- ఇడ్లీ, ఉప్మా, చపాతీ లాంటి త్వరగా అరిగిపోయే ఆహారం తీసుకోండి.
- ఇక మధ్యాహ్నం పచ్చటి కూరగాయలు, పప్పు ఉండేలా చూసుకోవాలి. మంచినీళ్లు మాత్రం బాగా తాగండి.
- పరీక్షలకు సిద్ధమయ్యే సమయంలో మాంసాహారం ముట్టొద్దు. ఎందుకంటే అవి అరగేందుకు ఎక్కువ ఆక్సిజన్ కావాలి. అప్పుడు మెదడుకు ఆక్సిజన్ సరఫరా తక్కువ అవుతుంది. మనకిష్టమైన పానీపూరీ, పావ్బాజీ, చాట్ లాంటివి మాత్రం కొద్దిరోజులు మర్చిపోవాలి.
- ఇక నిద్ర మాత్రం రోజుకు ఏడు గంటలు తప్పనిసరి. కనీసం ఆరుగంటలైనా ఉండాలట. నిద్రపోయే సమయంలోనే మనం చదివిన వాటన్నింటినీ మెదడు సేవ్ చేసుకుంటుందట. నిద్ర తక్కువైతే ఈ పనితీరు దెబ్బతింటుంది. అందుకే పరీక్ష మందురోజు త్వరగా పడుకొని, తెల్లవారుజామున లేవండి. తిండీ నిద్రా మాత్రమే కాకుండా మెదడు, శరీరం ఉత్సాహంగా ఉండేందుకు వ్యాయామమూ అవసరమే.
Authorization