తుంగెడ అనే గ్రామంలో మల్లయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర రెండు ఎద్దులు ఉన్నాయి. వాటికి ఒకటంటే మరోదానికి అస్సలు పడేది కాదు. ఒకటి కుడంటే, మరొకటి ఎడమ అనే రకం. రైతు ఎంత చెప్పినా అస్సలు వినేవి కాదు. చీటికీ మాటికీ కొట్లాడుకునేవి.
మల్లయ్యకు ఏం చెయ్యాలో పాలుపోక ఇంటి దగ్గర విచారంగా కూర్చున్నాడు. అది పక్కింటి సుబ్బయ్య చూశాడు. అతను చాలా తెలివైనవాడు. మల్లయ్యను సమీపించి ''ఏం మిత్రమా.. ఎందుకట్ల విచారంగా కూర్చున్నావు, ఏం జరిగింది'' అని ప్రశ్నించాడు.
అందుకు మల్లయ్య ''ఏం చెప్పను మిత్రమా... ఎంతో డబ్బు ఖర్చుపెట్టి ఈ ఎద్దులు కొన్నాను. కానీ ఇవేమో ఎడమొహం పెడమొహంగా ఉన్నాయి. తిట్టినా, కొట్టినా, మంచినా చెప్పినా వినడం లేదు. వీటితో వ్యవసాయం ఎట్లా చేయాలో అర్థంగాక తల బాదుకుంటున్నాను'' అన్నాడు.
అప్పుడు సుబ్బయ్య కాసేపు ఆలోచించి ''చూడు మిత్రమా... ఎంత శత్రువులైనా ఆపద వచ్చినపుడు కలుస్తుంటారు. నేనొక ఉపాయం చెబుతాను'' అంటూ ఏం చెయాలో చెప్పాడు. మల్లయ్య తరువాత రోజు ఎద్దుల్ని పక్కనే ఉన్న అడవిలోకి తీసుకెళ్లాడు. చిన్నచెట్టుకు కట్టేసి నీళ్లు తెస్తానని చెప్పి వెళ్లిపోయాడు. ఎంత సేపయినా రాలేదు. చీకటి పడసాగింది. వాటికి భయం వేయసాగింది. రెండూ చెరోవైపు మొహం పెట్టి కూర్చున్నాయి.
అంతలో దూరం నుంచి చిన్నగా పులి గాండ్రింపు వినబడింది. అదిరిపడి రెండు లేచి నిలబడ్డాయి. భయంతో వణికిపోయాయి. ఒకదాని ముఖం ఒకటి చూసుకున్నాయి. అంతలో పులి అరుపు మరింత దగ్గరగా గట్టిగా వినబడింది. అమ్మో పులి వచ్చేస్తోంది అనుకొని రెండూ తాడును చెరోవైపు లాగాయి.
అంతలో ఎదురుగా ఉన్న పొదల్లో ఏదో అలికిడి అయింది. చూస్తే అందులో తమవైపే చూస్తున్న పులి కనబడింది. ఎద్దులు రెండూ భయంతో ఒకదాని వంక ఒకటి చూసుకున్నాయి. ఇలాగే చెరోవైపు లాగుతూ గొడవ పడుతుంటే పులి చేతిలో చావడం ఖాయం అనుకున్నాయి. మౌనం వీడి ఒకేసారి మాట కలిపాయి. ఇద్దరం ఒకేసారి ఒకేవైపు తాడును లాగుదాం అనుకున్నాయి. దాంతో కాసేపటికి ఆ చిన్నచెట్టు విరిగిపోయి తాడు ఊడిపోయింది.
వెంటనే ఆ రెండూ ''మనం ఒకరికొకరం తోడుగా ఉంటే ఆ పులినే కాదు దేన్నైనా ఎదుర్కోగలం. ఎట్టి పరిస్థితుల్లోనూ విడిపోకూడదు'' అనుకొని కలిసి గ్రామం వైపు పరుగెత్తాయి.
అవి అలా పరుగెత్తగానే పొదల్లోంచి పులి తొడుగు ముఖానికి తగిలించుకున్న మల్లయ్య నవ్వుకుంటూ బైటకు వచ్చాడు. ఆ తర్వాత అవి కొట్లాడుకోవడం అతను ఎప్పుడూ చూడలేదు.
Authorization