అంటార్కిటికా.. ఇక్కడ ఎటు చూసినా మంచు ఎడారులు, మంచు తుఫాన్లు, గడ్డకట్టించే చలి. అందుకే 1911 వరకూ ఇక్కడికి ఎవ్వరూ చేరుకోలేకపోయారు. కానీ, ఇప్పుడు మాత్రం అన్ని దేశాల శాస్త్రవేత్తలు, పరిశోధకులు ఇక్కడ స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. వీళ్లలో భారతీయులూ ఉన్నారూ. ఇందుకు, ప్రపంచ దేశాల మధ్య 'అంతర్జాతీయ ఒప్పందం' కూడా ఉంది. ఇంతకీ వీళ్లంతా అక్కడికి ఎందుకు వెళ్తున్నారు?
- ఎప్పుడైనా గ్లోబును పరీక్షగా చూశారా? దాంట్లో పైవైపు ధ్రువాన్ని ఉత్తర ధ్రువం అనీ, కిందివైపు ధ్రువాన్ని దక్షిణ ధ్రువం అంటారని తెలుసుగా. అలా చూస్తే దక్షిణ ధ్రువం దగ్గర అంటే మన ప్రపంచం కిందికి అంటార్కిటికా ఖండం ఉంటుంది.
- ఇక్కడ మైనస్ డిగ్రీల్లో ఉష్ణోగ్రత ఉండి, విపరీతమైన గాలీ ఉంటుంది. సరాసరిన చూస్తే భూమి ఉపరితలం నుంచి పైకి దాదాపుగా 1,9 కిలోమీటర్ల మేర మంచు పేరుకుపోయి ఉంటుందట.
- విస్తీర్ణం పరంగా ఇది ఐదో అతిపెద్ద ఖండం. ఇంచుమించుగా ఆస్ట్రేలియాకు రెట్టింపు ఉంటుంది. కోటీ నలభై లక్షల చదరపు కిలోమీటర్లుఉంటుంది. ప్రపంచంలో అతి చల్లని ప్రాంతం ఇక్కడిదే.
- ఇలాంటి చోట మనుషులెవ్వరూ ఉండలేరనుకుంటే పొరపాటేనండోరు. ఇక్కడ వేసవిలో దాదాపు 4000 మంది నివాసముంటారు. చలికాలంలో వీళ్ల సంఖ్య వెయ్యికి తగ్గుతుంది. దాదాపు 30 దేశాలకు ఇక్కడ ప్రయోగ కేంద్రాలు ఉన్నాయి. ఇక్కడ చాలా ఎక్కువ కనిపించే జీవులు పెంగ్విన్లే.
- ప్రపంచంలో 90 శాతం స్వచ్ఛమైన మంచినీరు ఇక్కడే ఉంది. పాములు, తొండల్లాంటి సరీసృపాలు లేని ఏకైక ఖండమిది.
- 180 మిలియన్ సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, ఆసియా, భారత దేశాలన్నీ కలిసి అతిపెద్ద భూభాగంగా ఉండేవి. అదే 'గోండ్వానా'. ఇది అప్పట్లో అంటార్కిటికాతో కలిసి ఉండేది. భూమి పొరల్లో మార్పుల వల్ల దేశాలన్నీ ముక్కలుగా విడిపోయి దూరంగా జరిగాయనే వాదన ఉంది! ఈ వాదనలో నిజాలను కనిపెట్టాలంటే ప్రయోగాలు, పరిశోధనలు చేయాలి. అందుకే మన శాస్త్రవేత్తలు ఈ ప్రాంతంలోని ఖనిజ లవణాలను, భారతీయ నదుల్లోని మట్టితో పోల్చి చూస్తున్నారు.
- అయితే అక్కడ ఉండి పరిశోధనలు చేయాలంటే నివాసాలు అవసరం. కానీ అంటార్కిటికా వాతావరణంలో కట్టడాల నిర్మాణం చాలా కష్టం. అందుకే అంటార్కిటికాకు 3,231 మైళ్ల దూరంలోని జర్మనీలో గదులను తయారు చేసుకున్నారు. ఇవన్నీ బలమైన గాలులు, అత్యల్ప ఉష్ణోగ్రతలను తట్టుకునేలా కఠినమైన అల్యూమినియంతో తయారయ్యాయి. ఇలా వెయ్యి మెట్రిక్ టన్నుల బరువున్న 134 గదుల్ని తయారుచేసి మంచు ఖండానికి తరలించారు. వీటన్నిటినీ ఒకదానితో ఒకటి కలిపి బిగించేసరికి విశాలమైన భవనం తయారైపోయింది.
- భారతీయ పరిశోధనా కేంద్రాలు: 1983లో మనదేశం 'దక్షిణ గంగోత్రి' అనే మొదటి పరిశోధనా కేంద్రాన్ని అంటార్కిటికాలో ఏర్పాటు చేసింది. దీన్ని మంచుకప్పేయటంతో, 1989లో 'మైత్రి' అనే రెండవ కేంద్రం, తర్వాత 2012లో 'భారతి' అనే మూడవ కేంద్రం ఏర్పాటయ్యాయి. ఈ పరిశోధనా కేంద్రంలో భారతీయ శాస్త్రవేత్తలు నిరంతరంగా పరిశోధనలు చేస్తూ ఉంటారు.
- ముఖ్యంగా ఈ అంశాలపై.. జీవవైవిధ్యం, పర్యావరణం, సూక్ష్మజీవుల మనుగడ, లోతుగా తవ్వి తీసిన 'ఐస్ కోర్'ను పరిశీలించటం, భూకంపాలు, అగ్నిపర్వతాలు, అణుధార్మికత ఆనవాళ్లు కనిపెట్టటం.
- అయితే ఈ ఖండంలోని మంచు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ...కొన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ లేనంతగా కరిగిపోతుందట. ఏంటీ నష్టం అంటారా? ఈవిధంగా మంచు కరిగి నీరుగా మారుతోందంటే ఆ నీళ్లన్నీ ఈ సముద్రాల్లోకే వచ్చేస్తాయన్నమాట. అప్పుడేమో వీటి నీటి మట్టాలు పెరిగిపోతాయి. లోతట్టు ప్రాంతాలు అంచెలంచెలుగా సముద్రంలో కలిసిపోతాయి. అంతేకాదు ఒక్కోసారి మంచు పూర్తిగా కరిగపోదు కదా. ఒక్కోసారి దీని నుంచి పెద్ద పెద్ద మంచుముక్కలు విడిపోయి మహాసముద్రాల్లోకి వచ్చేస్తాయి. తెప్పల్లా తేలిపోతూ మన ఓడలకు డీ కొంటాయి. అప్పుడెప్పుడో టైటానిక్ ఓడ ఇలానే మునిగిపోయి వందల మంది చనిపోయారు.
Authorization