హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం మధ్యయుగాల నాటి ఓ వింత గురించి తెలుసుకోబోతున్నాం. ఏంటా వింత అంటారా..? పింగాణీ రాళ్లతో నిర్మించిన ఓ పగోడా కథ. ఆ పగోడాని ఏకంగా 270 అడుగుల ఎత్తున నిర్మించారు... ఇవే కాదు.. ఈ నిర్మాణం గురించి ఇంకా ఎన్నెన్నో విశేషాలు ఉన్నాయి.
- చైనాలోని క్విన్మై నదీతీరంలో నాంజింగ్ అనే పట్టణం ఉంది. మింగ్ రాజవంశానికి చెందిన యాంగ్లీ అనే రాజు తన తల్లిదండ్రుల గౌరవార్థం ఓ పగోడాని నిర్మించాలనుకున్నాడు. దానికి ఏదయినా ప్రత్యేకత ఉండాలని.. అందమైన లతలు, జంతువుల బొమ్మలని చెక్కిన పింగాణీ రాళ్లతో దీన్ని కట్టించాడు. 15వ శతాబ్దం నాటికి నిర్మాణం పూర్తయింది. ఈ పగోడాకి బవోన్సే (కృతజ్ఞత) అని పేరు పెట్టారు. ఉన్న పట్టణం పేరు మీదుగా దీన్ని నాంజింగ్ పగోడా అని కూడా పిలిచేవాళ్లు.
- తొమ్మిది అంతస్తులుగా నిర్మించిన ఈ పగోడా చుట్టుకొలత 100 అడుగులు ఉండేదట. లోపలికి అడుగుపెట్టిన వారు పైవరకూ వెళ్లేందుకు 180 పైగా మెట్లు ఉండేవి. పై అంతస్తుకి చేరుకునే దారి పొడవునా గూళ్లు ఉండేవి. వాటిలో రకరకాల ఆకారాలలో బుద్ధుని బొమ్మల్ని ఉంచారు. మార్గంలో చిన్న చిన్న గంటలు, వందకి పైగా దీపాలు కూడా ఉండేవి. చిట్టచివరి అంతస్తుకి చేరుకోగానే పొడవాటి స్తంభం కనిపించేది. దానికి తగిలించిన బంగారు కలశం అనాసపండు ఆకారంలో ఉండేది.
- రానూ రానూ ఈ పగోడా గురించి విదేశీయులకీ తెలిసిపోయింది. 16వ శతాబ్దంలో జోహన్ న్యూహాఫ్ అనే నెదర్లాండ్స్ యాత్రికుడు నాంజింగ్ పట్టణానికి చేరుకున్నాడు. అక్కడ ఈ పగోడాని చూసిన న్యూహాఫ్ 'ఏన్ ఎంబసీ ఫ్రమ్ ద ఈస్ట్ ఇండియా' అనే తన పుస్తకంలో పేర్కొన్నాడు. న్యూహాఫ్ వర్ణనతో ఈ పగోడా పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రచారం పొందింది. దీన్ని చూడ్డానికి దేశవిదేశాల్నుంచి యాత్రికులు వచ్చేవాళ్లు. పగటి వేళల్లో సూర్యకాంతికి మెరిసిపోతూ, రాత్రిళ్లు దీపాల వెలుతురుకి ప్రతిఫలించే ఈ పగోడాకి ఆదరణ పెరిగిపోయింది. దీన్ని అనుకరిస్తూ పాశ్చాత్య దేశాల్లోనూ పగోడాలను నిర్మించారు. అలాంటి పగోడా ఒకటి లండన్లోని క్యూ ఉద్యానవనంలో ఇప్పటికీ ఉంది.
- అయితే1801లో ఈ పగోడా మీద పిడుగు పడటం వల్ల, పై మూడు అంతస్తులు కూలిపోయాయి. వాటినైతే త్వరలోనే తిరిగి నిర్మించారు. కానీ ఆ తరువాత మనుషులు చేసిన విధ్వంసాన్ని మాత్రం ఎవరూ ఆపలేకపోయారు. 1850-64 మధ్య చైనాలో తైపింగ్ అనే విప్లవం వచ్చింది. క్వింగ్ రాజవంశానికి వ్యతిరేకంగా చెలరేగిన ఈ విప్లవంలో లక్షల మంది చనిపోయారు. తైపింగ్ విప్లవకారులకి బౌద్ధం అంటే గిట్టేది కాదు. అందుకని బౌద్ధ కట్టడాలను కూల్చివేసేవాళ్లు. అలా 1853లో నాంజింగ్ను ఆక్రమించుకున్న విప్లవకారులు పగోడా లోపలి భాగాన్నంతా ధ్వంసం చేసేశారు.
- ఆ తరువాత 1856లో చైనాకు మద్దతుగా అమెరికా సైన్యం పట్నంలోకి ప్రవేశిస్తుందనే వార్తలు వినిపించాయి. దాంతో పింగాణీ పగోడా సైన్యానికి దక్కకూడదు అనుకున్నారు విప్లవకారులు. అందుకని మిగిలిన గోడల్నీ కూలగొట్టేశారు. శిథిలాల్లో ఉన్న రాళ్లూ రప్పలను స్థానికులు ఇండ్ల పునాదుల కోసం వాడేసుకున్నారు. ప్రస్తుతం నాంజింగ్ ప్రదర్శనశాలలో ఈ పగోడాకు సంబంధించిన అవశేషాలు కొన్ని మాత్రమే భద్రంగా ఉన్నాయి.
- అయితే ఒకప్పుడు దేశానికే గర్వకారణమైన ఈ పింగాణీ పగోడాని తిరిగి నిర్మించాలనే ఆలోచనలు ఉన్నాయి. ఇందుకోసం విరాళాలు సేకరిస్తున్నారు.
Authorization