జపాన్లో ఇనక్డేట్లో ఓ చిన్నగ్రామం. అక్కడ జరిగిన తవ్వకాల్లో రెండువేల ఏండ్ల క్రితమే ఆ ప్రాంతంలో వరి పండించారని తెలిసింది. ఈ విషయాన్ని ఎలాగైనా ప్రపంచం దృష్టికి తీసుకురావాలని అనుకున్నారు ఆ గ్రామ ప్రజలు. దానికోసం ఏం చేస్తే బాగుంటుందా అని ఆలోచించగా..చించగా భలే ఆలోచన వచ్చింది. ఓ మైదానంలో నాలుగు రంగుల్లో ఉండే వరి మొక్కల్ని క్రమపద్ధతిలో నాటారు. అవి పెరిగాక దూరం నుంచి చూస్తే పేద్ద బొమ్మలా కనిపిస్తుందన్నమాట. ఆ బొమ్మల్ని పై నుంచి చూసేందుకు, 66 అడుగుల ఎత్తుండే స్తంభాన్ని కూడా నిర్మించారు. 1993లో ప్రారంభమైన ఈ ఆచారం ఇప్పటికీ సాగుతోంది. ఏటా ఫలానా చిత్రాన్ని తయారుచేయాలని నిర్ణయించుకుంటారు గ్రామస్థులు. అది తయారయేందుకు ఎక్కడ ఏ రంగు మొక్క నాటాలో సరిచూసుకుంటారు. ఏడాది చివర్లో ఆ వరిపంటని మామూలుగానే కోసుకుంటారు. మరుసటి ఏడు మరోచిత్రానికి సిద్ధమవుతారు. ఈ బొమ్మల్ని చూసేందుకు ఏటా లక్షకి పైగానే పర్యాటకులు వస్తారట. వీరికోసం ప్రత్యేకంగా ఓ రైలుని కూడా ఏర్పాటు చేశారు. మనం ఎలాగూ అంత దూరం వెళ్లలేం కదా! ఆ బొమ్మల్ని ఇక్కడ చూసేద్దాం.