పిల్లలూ పీతల దీవి అనగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. అక్కడ పీతలు ఉంటాయని....అయితే అన్నీ ఇన్నీ పీతలు కావు మరి... కొన్ని కోట్ల సంఖ్యలో ఉంటాయి.. ఒక్క మాటలో చెప్పాలంటే మనుషుల కంటే పీతల సంఖ్యనే ఎక్కువ అక్కడ. అవి కూడా ఏర్రపీతలు. మరి ఆ విశేషాలేంటో తెలుసుకుందామా..!
- ఇండోనేషియా, ఆస్ట్రేలియాలకు మధ్య హిందూ మహాసముద్రంలో ఉందీ క్రిస్మస్ ద్వీపం. ప్రస్తుతం ఆస్ట్రేలియా ఆధీనంలో ఉన్న దీని విస్తీర్ణం 130 చదరపు కిలోమీటర్లు. జనాభా 1600. కానీ ఈ ద్వీపంలో పీతల సంఖ్య ఎంతో తెలుసా! 15 కోట్ల పైమాటే. అక్కడుండే ఒక్కొక్కరికీ వీటన్నిటినీ పంచిపెడితే లక్షకు పైనే వస్తాయి.
- సహజంగా మనకు పీతలు సముద్రం ఒడ్డున బొరియల్లో, వర్షాకాలంలో చెరువుల దగ్గర, పంటపొలాల్లో కనిపిస్తాయి. కానీ ఇక్కడుండే పీతలు మాత్రం పక్కనుండే అడవుల్లో నివసిస్తాయి.
- ఈ ఎర్రపీతలు నేలల్లోనే బొరియలు చేసుకుని జీవిస్తాయి. వీటి ఆహారం పండ్లు, ఆకులు, విత్తనాలు. అలాగని శాకాహారులేం కాదు సుమా దొరికితే చనిపోయిన పక్షుల్ని, నత్తల్ని కూడా హాంఫట్ చేస్తాయి.
- ఇక్కడుండే పీతలు చాలా వరకూ ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి. కొద్ది సంఖ్యలో నారింజ, అరుదుగా ఊదా రంగువీ కనిపిస్తాయి. 40 మిల్లీ మీటర్ల వరకూ ఎదుగుతాయి. చేపలలాగా వీటికీ తిత్తులు, మొప్పలు ఉంటాయి. ఆడవాటికి మగవాటికంటే పొట్టభాగం ఎక్కువుంటుంది. అయితే మగవాటికి వీపు భాగంలో ఉండే డిప్ప వంటి భాగం, కాళ్లు బలంగా పెద్దవిగా ఉంటాయి.
- ప్రతి ఏటా ఈ పీతలన్నీ ఓ పేద్ద పనిపెట్టుకుంటాయి. దానికోసం ఒకదాన్నొకటి తోసుకుంటూ కొండలు, కోనలు, ఊళ్లు, వాడలూ దాటేస్తాయి. ఇంతకీ... పీతలన్నీ పోటీపడుతూ ఎక్కడికెళ్తాయో తెలుసా! సముద్ర తీరానికి. ఎందుకంటే.. వాటి సంతానోత్పత్తి జరిగేది అక్కడే. అక్టోబరు నుంచి డిసెంబర్ మధ్యలో మగవన్నీ ముందుగా సముద్ర తీరానికి వలసకడతాయి. తీరంలో అనువైన ప్రదేశం చూసుకుని బొరియలు చేసి ఆడవాటి కోసం ఎదుచూస్తుంటాయి. ఇక ఆడపీతలు 5 నుంచి 7 రోజుల్లోపు నెమ్మదిగా బయలుదేరి అక్కడికి చేరుకుని ఆ బొరియల్లో చేరతాయి. ఇలా ఇవన్నీ సముద్రాన్ని చేరుకోవడానికి సుమారు 8-10 కిలోమీటర్లు ప్రయాణిస్తాయి.
- ఆడపీతలు 3 రోజుల్లో గుడ్లుపెట్టే దశకొస్తాయి. అప్పుడు సముద్రంలోకి వెళ్లి పెద్దగా అలలు లేని చోట, మసక ప్రాంతాల్లో గుడ్లను విడుస్తాయి. ఒక్కోచోట వంద చొప్పున ఒక్కో పీతా లక్ష గుడ్ల వరకూ పెడుతుంది. ఈ ప్రక్రియ ఒకేసారి కాకుండా విడతల వారీగా అయిదారు రోజులు ఉంటుంది. ఆ గుడ్లు 12-13 రోజుల్లో లార్వా దశకు చేరుకుంటాయి. అంతవరకూ ఆడవి అక్కడే ఉండి తరువాత అడవుల్లోకి ప్రయాణం కడతాయి. లార్వాలు ప్లిలలుగా మారేందుకు నాలుగు వారాలు పడుతుంది. ఆ తరువాత అవి కూడఅటవీ ప్రాంతాలకు చేరుకుంటాయి.
- పీతల సంతానోత్పత్తి దశ మొత్తం రెండు నెలలు ఉంటుంది. ఈ లోపు అవి ప్రయాణం చేస్తూనే ఉంటాయి. అందుకే స్థానిక అధికారులు ఈ వలసల సమయాల్లో రోడ్లను మూసివేయిస్తారు. వాహనదారులు రాకను మళ్లించే బోర్డులను పెట్టి ప్రత్యేక రహదారుల్ని ఏర్పాటుచేస్తారు. పీతల పయనం కోసం భూమి లోపల సొరంగాల్ని తవ్విస్తారు. అయినప్పటికీ ఈ ఎర్రపీతలు రహదారుల మీదికొచ్చేసి భవనాలు, వంతెనలు, వాహనాలు దాటుకుంటూ గమ్యానికి చేరుకుంటాయి.
- ఈ సమయంలో ఆకాశం నుంచి చూస్తే నేలంతా ఎర్రతివాచీ పరిచినట్టు కనిపిస్తుందట. అన్ని కోట్ల ఎర్ర పీతల్ని చూసేందుకు ఎంతోమంది పర్యాటకులు సముద్ర తీరాలకు, రహదారుల మీదికి చేరుకుంటారు.
Authorization