పిల్లలూ..! మన రాష్ట్ర పక్షి ఏదనగానే 'పాలపిట్ట' అని ఠక్కున చెబుతారు. ఈ పక్షి ఒక మన రాష్ట్రానికే కాదు ఎన్నో రాష్ట్రాలకూ రాష్ట్రపక్షి. మరి దాని గురించి వివరంగా తెలుసుకుందామా..
- పాలపిట్ట రోలర్ కుటుంబానికి చెందిన పక్షి. మగ పాలపిట్ట ఆడ పాలపిట్ట రెండూ ఒకేలా ఉంటాయి. మెడ, పొట్ట భాగం ముదురు గోధుమరంగులో, తెల్లటి గీతలతో ఉంటాయి. తల పైభాగం, రెక్కలు లేత నీలం, ముదురు నీలం రంగుల్లో ఉంటాయి.
- కొరేషియస్ బెంగాలెన్సిస్.. ఇది భారతదేశపు పాలపిట్ట శాస్త్రీయనామం. ఈ పక్షులు భారత్, ఇరాక్, థాయిలాండ్ దేశాల్లో ఎక్కువగా, మిగతా ఆసియా దేశాల్లో అరుదుగా కనిపిస్తాయి. మనదేశంలో పాలపిట్టని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బిహార్, ఒడిశా రాష్ట్రాలు రాష్ట్రపక్షిగా ఎంచుకున్నాయి.
- వీటి మనుగడ మొత్తం గడ్డి భూముల్లోనూ మైదానాల్లోనూ సాగుతుంది. రహదార్లకు పక్కనుండే చెట్లపైన, విద్యుత్ తీగల మీద వాలి కనిపిస్తాయి. పంట పొలాల్లో తిరుగుతుంటాయి. ఇవి వలస పక్షులు కానప్పటికీ రుతువులు అనుసరించి ప్రాంతాలను మారుస్తుంటాయి.
- ఈ పక్షి అందమైందే కావచ్చు. కూత మాత్రం కరుకుగా ఉంటుంది. ఒకోసారి కాకిలా, మరోసారి రేకుమీద గీసినట్టుగా కీచుమంటూ అరుస్తుంది.
- ఆంగ్లంలో దీన్ని బ్లూబర్డ్ అంటారు. ఇంకా బ్లూ జే అనీ పిలుస్తారు. ఎగురుతూ విన్యాసాలు చేస్తుందని రోలర్ బర్డ్ అని పేరొచ్చింది. పాలపిట్టలు చేసే విన్యాసాలు... చూడముచ్చటగా ఉంటాయి. ఎగురుతూనే రెక్కలు ముడిచి, తోక ఊపుతుంటాయి. ముక్కుపైకి పెట్టి నిట్ట నిలువుగా ఎగురుతుంటాయి. ఇదంతా ఆడపాలపిట్టల్ని ఆకర్షించేందుకేనట. ఇంకా నీటిలోకి బాణంలా దూసుకుపోయి స్నానం చేస్తాయి. చేపల్ని కూడా ఇలాగే పట్టి తింటాయి. ఇంకా కప్పలు, కీచురాళ్లు, మిడతల్లాంటివే కాకుండా చిన్న చిన్న పాముల్నీ తింటాయి.
- పాలపిట్టలు మార్చి- జూన్ మధ్యలో 3 నుంచి 5 గుడ్లను పెడతాయి. వడ్రంగి పిట్టలు చేసే చెట్ల మానుల్లోనూ, నిర్మాణాల మధ్యల్లో ఉండే ఖాళీల్లోనూ గుడ్లను పెడతాయి. గుడ్లను పొదిగే విషయంలో మాత్రం వీటి ప్రవర్తన వింతగా ఉంటుంది. మిగతా పక్షులేవైనా రెండింట్లో ఏదో ఒకటే పొదుగుతుంది. కానీ ఇవి మాత్రం ఆడ, మగ పక్షులు రెండూ కలిసి 17-19 రోజులు గుడ్లను పొదుగుతాయి. పాలపిట్ట గుడ్లు పిల్లలయ్యాక నెలవరకే గూట్లో ఉండి ఎగిరిపోతాయి.
- పాలపిట్టను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. కర్ణాటక ప్రాంతీయులు దీన్ని నీలకంఠ, నీలకంఠి అంటారు. ఇంకా కికి, కిదివి, చాషము, చిత్రవాజము, చిత్రవాలము, పాలగుమ్మ, పూర్ణకూటము, సుపర్ణము అని రకరకాలుగా పిలుస్తుంటారు.
పురాణాల్లో పాలపిట్ట
పురాణ కథలలో దీని ప్రస్తావన ఉంది. పాండవులు అరణ్యవాసం ముగించుకుని వస్తున్నప్పుడు ఎదురొచ్చిందట. అప్పటి నుంచి వాళ్లకు అన్నిటా విజయాలు చేకూరాయట. అందుకే పాలపిట్టను శుభానికి సంకేతంగా భావిస్తారు. దసరానాడు సాయంత్రం ఊరి పొలిమేరకు వెళ్లి పాలపిట్ట దర్శనం చేసుకొస్తే మంచి జరుగుతుందని తెలుగువాళ్లు నమ్ముతారు.
Authorization