సుకుమారయ్య పండ్ల వ్యాపారంలో మంచిపేరు గడించాడు. కొడుకు గిరిధర్ సోమరిలా తిరగడం అతనికి సమస్యగా మారింది. సుకుమారయ్య మిత్రులు పరంధామం, విశ్వనాథం 'వాడ్ని ఇంట్లోకి రానివ్వకు' అని సలహా ఇచ్చారు. వాళ్ల మాటల్ని చాటుగా విన్నాడు గిరిధర్. గ్రామ పెద్దను కలిసి తండ్రి ఆస్తిలో తన వాటా ఇమ్మని పంచాయతీ పెట్టాడు. కొడుకు ప్రవర్తనకి సుకుమారయ్య చాలా బాధపడ్డాడు. గ్రామాధికారి సమక్షంలో ఆస్తిని చెరిసగం చేశారు. ఇంకా మిగిలినవి పండ్ల దుకాణం, మునగ, మర్రి చెట్లు.
పండ్ల దుకాణం రెండు భాగాలు చేశారు. మునగ చెట్టు ఉన్నవైపు భాగాన్ని సుకుమారయ్య తీసుకున్నాడు. కలపకు కూడా పనిచెయ్యని మర్రిచెట్టువైపు తనకు వదిలేశారని ఆక్షేపించాడు గిరిధర్. పంతం పట్టి తన వాటా దుకాణం నడపసాగాడు. వయసు మీద పడటంతో సుకుమారయ్య పండ్ల ఎంపిక, నాణ్యత చూసుకోలేకపోయాడు. దాంతో గిరిధరుడి దుకాణానికే జనం వెళ్లసాగారు. పైగా మండు వేసవిలో కూడా చల్లని నీడనిచ్చే మర్రిచెట్టు కింద ఉండటం జనం సేదదీరేందుకు అనుకూలమైంది.
కొన్నాళ్లకు మునగచెట్టు ఎండిపోయింది. సుకుమారయ్య దుకాణం మూలనపడే స్థితికొచ్చింది. ఇంట్లోంచి గెంటేయమన్న తండ్రి మిత్రులు కూడా తన దుకాణానికే రావడం చూసి గిరిధర్ హేళనగా నవ్వాడు. అదిచూసి వాళ్లు కనుసైగ చేసుకున్నారు. గిరిధర్కి ఏమీ అర్థం కాక వాళ్లను చాటుగా వెంబడించాడు.
విశ్వనాథం మాటల్లో 'చూశావా పరంధామం! సుకుమారయ్య మనసు. కావాలనే త్వరలో ఎండిపోబోతున్న మునగచెట్టుని తీసుకున్నాడు. చల్లదనాన్నిచ్చే మర్రిచెట్టు నీడలో కొడుకు వ్యాపారం వృద్ధి అయ్యేలా చేశాడు' అన్నాడు.
దానికి పరంధామం 'అంతేనా! కావాలనే నాసిరకం పండ్లు తెచ్చి దుకాణంలో అమ్మాడు. వచ్చిన జనాన్ని కొడుకు దుకాణం వైపు మరల్చాడు. అలా తన వంతుగా కొడుకు వ్యాపారాన్ని వృద్ధి చేశాడు. ఇదంతా ఆ గిరిధర్కి తెలియక వ్యాపారాభివృద్ధికి తానే కారణమనుకుంటున్నాడు' అనన్నాడు.
చాటునుంచి వాళ్ల మాటలు విన్న గిరిధర్కి కళ్లు చెమర్చాయి. తన బాగు కోరిన తన తండ్రి మనసు అర్థం చేసుకోలేకపోయానని సిగ్గుపడ్డాడు. పశ్చాత్తాపంతో తండ్రి దగ్గరికి వెళ్లి క్షమించమని కాళ్లమీద పడ్డాడు.
Authorization