పిల్లలూ..! ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న వాటిల్లో అతిపెద్ద జీవి నీలి తిమింగలం. ఆ తరువాత స్థానం ఏనుగుదే... మరి మనం పుట్టక ముందు వీటికంటే చాలా పెద్దజీవులుండేవని తెలుసా..? అవే డైనోసార్లు. ఈ పేరు మీరు తరచూ సినిమాల్లో వినే ఉంటారు ... వీటిపై ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి... మరి వీటి గురించి తెలుసుకుందామా...
డైనోసార్ అన్నది గ్రీకు భాషా పదం. దీనర్థం రాక్షస బల్లి అని. 1676లో రిచర్డ్ ప్లాట్ తొలిసారి వీటి అవశేషాలను ఇంగ్లాండ్లో కనుగొన్నాడు. కానీ వీటికి పేరు పెట్టింది మాత్రం 1842లోనే. పాలియన్టాలజిస్ట్ (అంతరించిన జీవుల పరిశోధకుడు) రిచర్డ్ వేవెల్ ఈ జీవుల భారీ ఆకారాన్ని చూసి డైనోసారస్ అన్న పేరుపెట్టాడు.
వీటిల్లో అనేక జాతులు ఉంటాయి. కాబట్టి వాటిని గుర్తుపట్టడం కోసం రిచర్డ్ ఒక జాతికి మెగాలోసారస్ అనే పేరుకూడా పెట్టాడు. తర్వాత్తర్వాత శాస్త్రవేత్తలు, వివిధ జాతుల డైనోసార్లన్నిటికీ పేర్లు పెట్టేశారు.
భూమ్మీద రాక్షస బల్లులు దాదాపు 25 కోట్ల సంవత్సరాల కిందట పుట్టాయి. ఆరున్నర కోట్ల సంవత్సరాల క్రితం వరకూ హాయిగా జీవించాయి. అవి జీవించిన కాలాన్ని మెసోజాయిక్ ఎరా అంటారు. వాటి కాలాన్ని ముఖ్యంగా మూడు భాగాలుగా విభజించారు. అవి ట్రిసియక్ కాలం... జురాసిక్ కాలం... క్రిటేషస్ కాలం
ట్రిసియక్ కాలంలో నీరు తక్కువగా ఉండేది. భూమి చాలా వరకు ఎడారి ప్రాంతాలతో నిండి వేడిగా ఉండేది. ఆ వాతావరణంలో కేవలం పాకుడు జంతువులు మాత్రమే జీవించగలవు. కాబట్టే ఈ రాక్షస బల్లులు అవతరించగలిగాయి. వీటి మూత్రపిండాలు నీటి కొరతను తట్టుకునే విధంగా ఉండేవి. ఈ కాలం ఇరవై కోట్ల సంవత్సరం వరకూ సాగింది. ట్రిసియక్ కాలం చివరిలో భూకంపాలూ, అగ్ని ప్రమాదాలు ఎక్కువగా సంభవించేవి.
ఆ తరువాత జురాసిక్ కాలం పద్నాలుగున్నర కోట్ల సంవత్సరం వరకూ సాగింది. డైనోసార్లలో వివిధ రకాల జాతులన్నీ జురాసిక్ కాలంలోనే పుట్టాయి. కొన్ని శాఖాహారులు, మరికొన్ని మాంసాహారులు. ఇంకా రెక్కలున్న డైనోసార్లు కూడా ఈ కాలంలోనే పుట్టాయి.
ఇక క్రిటేషస్ కాలం డైనోసార్లకు ముగింపు కాలం. ఈ కాలం ఆరున్నర కోట్ల సంవత్సరం దాకా సాగింది. డైనోసార్లు వివిధ ప్రాంతాలకు ప్రయాణించి, చివరికి భూమంతా విస్తరించాయి. ఈ సమయంలోనే వీటిలో చిన్న చిన్న జీవులు కూడా పుట్టడం మొదలైంది. క్రిటేషస్ కాలం చివరిలో అనేక గ్రహ శకలాలు ఈభూమ్మీద పడి, భూకంపాలు, విధ్వంసాలు సంభవించి డైనోసార్ల జాతి అంతరించిదంటారు శాస్త్రవేత్తలు
ఒక డైనోసార్ ఒకసారి 20 నుంచి 30 గుడ్లు పెడుతుంది. తొలిసారి వాటి గుడ్డుని ఫ్రాన్స్లో కనుగొన్నారు. రెండడుగులు ఉండే అతిపెద్ద గుడ్డుని మాత్రం చైనాలో కనుగొన్నారు.
నిజానికి వీటి అవశేషాలు ప్రతి ఖండంలోనూ దొరికాయి. మనదేశంలో కూడా డైనోసార్లు జీవించాయని చాలా ఏండ్ల క్రితమే తెలిసింది. అవును 1828లో దేశంలో సరిహద్దులు నిర్ణయించే సమయంలో మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఒక భారీ ఎముక వారిని ఆశ్చర్యపరిచింది. అది డైనోసార్ అవశేషమని వాళ్లు తర్వాత గుర్తించారు. అది జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థ దగ్గర ఉంది. అంతేకాదు జియోగ్రాఫికల్ స్టడీస్ సంస్థ 1996లో గోదావరి ప్రవహించే ప్రాంతంలో ఎన్నో డైనోసార్ల అవశేషాలను గుర్తించింది.
శాస్త్రవేత్తలు ఇప్పటికి వెయ్యి రకాల డైనోసార్ జాతులను గుర్తించారు.
Authorization