పండగో, పుట్టినరోజో వస్తే చాలు ఇంట్లో సేమ్యా పాయసం వండాల్సిందే. ఇంట్లో, పిల్లా, పెద్దా అందరూ దాన్ని లొట్టలేసుకుంటూ తినాల్సిందే. వెర్మిసెల్లీ, సెమొలినా అని కూడా పిలిచే సేమ్యాను 14వ శతాబ్దం నుంచే వాడుతున్నట్లు, దాన్ని మొట్టమొదటగా ఇరాన్లో తయారుచేసినట్లు తెలుస్తోంది. సేమ్యా తయారీకి 'దురుం' అనే ప్రత్యేక రకానికి చెందిన గోధుమలను వాడుతారు. ముందుగా గోధుమలను దంచి పైపొట్టు తీస్తారు. వీటిని మరలో వేసి మెత్తటి పిండిగా చేస్తారు. ఆ తరువాత ఆ పిండికి సమపాళ్లలో నీటిని కలిపి ముద్దగా చేస్తారు. సన్నటి గాడులున్న చెక్కపలకలను ఏటవాలుగా పెట్టి పిండి ముద్దను తీసుకుని గాడులపై చేతులతో బలంగా పైకి కిందికి రుద్దుతారు. అప్పుడు ఆ పిండి సన్నని దారపుపోగులుగా కిందకి పడుతుంది. వీటిని నీడలో ఆరబెట్టి నిల్వ చేస్తారు. ఇప్పుడు మెషీన్లలోనూ సేమ్యా తయారుచేస్తున్నారు.