పిల్లలూ! పిల్లులంటే కొందరికి ఎంతో ఇష్టముంటుంది. అందుకే వాటిపై ప్రేమతో ఇంట్లో పెంచుకుంటుంటారు. కానీ ఓ జంతుప్రేమికురాలు మాత్రం వాటికోసం ఏకంగా ఓ పడవనే ఇంటిగా మార్చేసింది. దానిపేరే క్యాట్బోట్. అంతేకాదు అందులో సకల సౌకర్యాలూ ఏర్పాటు చేసి వాటిని ఆలనాపాలనా చూసేందుకు వర్కర్లను కూడా నియమించింది.
- నెదర్లాండ్స్ రాజధాని ఆమ్స్టర్డ్యామ్ నగరంలోని హెరెగ్రాంట్ కాలువపై ఈ హౌస్బోట్ ఉంది. ప్రపంచంలో పిల్లులకోసం ఉండే ఒకే ఒక్క క్యాట్ బోట్ ఇది.
- పిల్లులకోసం ఓ పడవను తీసుకుని అందులో ఇల్లును నిర్మించాలనే కోరిక హెన్రీట్ అనే జంతు ప్రేమికురాలికి కలిగింది. 1966 సంవత్సరంలో ఓ పడవను తీసుకుని దాన్ని పిల్లులకు అనుకూలంగా మార్చింది.ది. పిల్లులు తిరగటానికి, ఆడటానికి.. వీలైతే పైఫ్లోర్కు వెళ్లి హాయిగా ప్రకతిని చూస్తూ గాలిపీల్చుకోవటానికి వీలుగా ఈ హౌస్బోట్ నిర్మాణం ఉంది.
- పిల్లులు ఎంచక్కా వాటికి కేటాయించిన చిన్నపాటి గదుల్లో గంటల తరబడి గుర్రుపెట్టి నిద్రపోతాయి. నిద్రలేస్తూనే నీరు, ఆహారం సప్లై చేసే పనిమనుషులు ఆ పడవలో ఉంటారు. అవి గట్టిగా అరిచినా, అరవకుండా ఓ చోట సైలెంట్గా పడకేసినా వెంటనే అక్కడ పనిచేసే ఉద్యోగులు అప్రమత్తమవుతారు. వైద్యులు రంగంలోకి దిగి పిల్లుల ఆరోగ్యపరిస్థితిని సమీక్షిస్తారు.
- ఈ విలాసవంతమైన బోట్ను చూడటానికి వందలాదిమంది సందర్శకులు వస్తుంటారు. ఎంచక్కా దూరం నుంచే పిల్లుల్ని ఫొటోలు తీసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం చేస్తుంటారు.
- హెన్రీట్ ఈ హౌస్బోట్ను నిర్మించటానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే హెన్రీ జంతుప్రేమికురాలు కావటంతో తప్పిపోయిన పిల్లుల్ని, గాయపడిన పిల్లుల్ని చేరదీసేది. అలా ఆమె పదుల సంఖ్యలో ఆమ్స్టర్డ్యామ్లోని హెరెగ్రాంట్ కాలువకు దగ్గరగా ఉండే తన ఇంట్లో పెంచేది. రెండేళ్ల తర్వాత పిల్లులు ఎక్కువై ఆ ఇల్లు సరిపోలేదు. ఆ సమయంలో కాలువ వెంబడి వెళ్తుంటే ఆ కాలువలో ఖాళీగా పడిఉన్న పాత పడవను చూసింది. ఆ పడవనే పిల్లుల ఇల్లుగా మార్చాలనే ఆలోచన వచ్చిన వెంటనే హౌస్బోట్లోకి పిల్లుల్ని చేర్చింది. ఆ తర్వాత ప్రభుత్వ అధికారులను ఒప్పించింది. అలా 1987 సంవత్సరంలో అఫిషియల్గా 'క్యాట్బోట్' ప్రారంభమైంది.
- 2005లో హెన్రీ మరణించింది. అయినప్పటికీ క్యాట్బోట్ ఇప్పటికీ కొనసాగుతోంది. స్వచ్ఛందంగా ఆ క్యాట్బోట్ను చూసుకోవటానికి యువత ముందుకొచ్చింది. ప్రస్తుతం వారే ఆ క్యాట్బోట్ను చూసుకుంటున్నారు.
- ఇక్కడ ఇంకో సదుపాయం కూడా ఉంది. ఏంటంటే... పిల్లుల దత్తత. పిల్లుల్ని దత్తత తీసుకోవటానికి ఎవరైనా వస్తే వారిని సవాలక్ష ప్రశ్నలు అడిగి, వారింట్లోని జంతువులతో ఎలాంటి ఇబ్బంది ఉండదనే హామీపత్రంతోనే పిల్లిప్రేమికులకు దత్తత ఇస్తారు నిర్వాహకులు.
- క్యాట్బోట్లోపలికి ప్రవేశిస్తుంటే.. ఎదురుగా 'డేంజరస్' అనే బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు ఎందుకు పెట్టారంటే సందర్శకులు చీటికిమాటికి వచ్చి పిల్లుల్ని ఇబ్బంది పెడతారని క్యాట్బోట్లోని స్టాఫ్ అంటున్నారు. మొత్తానికి సంవత్సరంలో ఐదువేల మంది ఈ క్యాట్బోట్ను సందర్శిస్తారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకూ సందర్శకులను ఉచితంగా ఇందులోకి అనుమతిస్తారు. బుధ,ఆదివారాల్లో సెలవు. ప్రభుత్వ సహకారం లేకున్నా, కేవలం విరాళాల ద్వారానే ఈ క్యాట్బోట్ నడుస్తుంది.
Authorization