తడిమట్టిలో కేవలం విడివిడి మట్టి రేణువులు ఉంటాయి. వీటి మీద నీటి అణువులు ఉండడం, ఈ రేణువులన్నీ కలిసి ముద్దగా ఉండడం వల్ల మనం ఆ ముద్దను ఏ రూపంలోకైనా తీసుకురాగలం. ఇటుకల కోసం వాడే ఎర్రమట్టి ఇలాంటిదే. అయితే ఇటుకలు చేసిన తర్వాత ఆరబెట్టినప్పుడు ఇసుక, మట్టి రేణువుల మధ్య ఇంకా కొన్ని నీటి అణువులు ఉండడం వల్ల ఆ ఇటుక రూపం అలాగే ఉంటుంది. ఇలాంటి స్థితిలో ఇటుక దిమ్మెలను బట్టీలో అధిక ఉష్ణోగ్రతకు గురిచేసినప్పుడు నీటి అణువులు అక్కడి నుంచి ఆవిరైపోయినా, మట్టిలో ఉన్న విడి విడి రేణువుల్లోని ఉపరితలాల వద్ద కొత్త రసాయనిక బంధాలు ఏర్పడతాయి. పింగాణీ వస్తువులు, కుండలు, ఇటుకలు, గాజు పదార్థాల తయారీలో ఇలాంటి ఉష్ణ రసాయనిక చర్యలు కీలక పాత్ర వహిస్తాయి. ఇలా తయారయ్యే పదార్థాలను కాంపోజిట్స్ అంటారు. బట్టీలో తయారయ్యే ఇటుకలు ఓ విధమైన కాంపోజిటే.