చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే ఢిల్లీ నగరాన్ని ఏడుసార్లు నిర్మించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ నగరం మొట్టమొదటి పేరు ఇంద్రప్రస్థం. ఈ నగరాన్ని ఈ పేరుతోనే పురాణాలలో పేర్కొనేవారు. క్రీస్తు పూర్వం 1400 సంవత్సరం ప్రాంతంలో ఇది పురానాఖిల్లా, హుమయూన్ టూంబ్ల మధ్య ప్రాంతంలో ఉండేది. క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దంలో కుతుబ్మీనార్ ప్రాంతంలో ధిలు అనే రాజు ఢిల్లీని నిర్మించాడు. ఆయన పేరు మీద ఇది వరుసగా ధిల్లి, ఢిల్వి, దేహలి, ఢిల్లీ అయింది. 13వ శతాబ్దంలో కుతుబుద్దీన్ కుతుబ్మీనార్ను కట్టించి, ఢిల్లీని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. 1296-1316లో రెండవసారి ఢిల్లీని అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించాడు. మూడవసారి ఢిల్లీని (1320-25)లో ఘుయాజుద్దీన్ తుగ్లక్ నిర్మించాడు. ఫిరోజ్షా తుగ్లక్ (1351-88) ఢిల్లీ నగరాన్ని నాలుగోసారి నిర్మించాడు. ఐదవసారి 1526లో హుమయూన్, ఆరవసారి 1540లో షేర్షా, ఏడవసారి షాజహాన్ నిర్మించాడు. తర్వాత అనేక పర్యాయాలు ఢిల్లీ తన రూపు రేఖలు మార్చుకుంటూ వచ్చింది.ఢిల్లీ అని మనం అలవాటుగా అంటున్నాం కానీ, నిజానికి దానిని దిల్లీ అని అనాలి.