మ్యూజియం అంటే ఎక్కడైనా నేలమీద ఉంటుంది కదా! కానీ ఈ మ్యూజియాలను నీళ్లలో నిర్మించారు. అంటే గాజుపెట్టెల్లాంటి అక్వేరియం అనుకుంటున్నారా? మీరు పప్పులో కాలేసినట్లే. ఈ మ్యూజియాన్ని చూడాలంటే ఈతదుస్తులు, ఆక్సిజన్ సిలిండర్లు తగిలించుకొని నీటిలోకి దూకాల్సిందే..విచిత్రంగా ఉంది కదూ.. అందుకే ఆ వింత మ్యూజియాల వింతలు, విశేషాలేమిటో తెలుసుకుందాం రండి...
మ్యూజియో అట్లాంటికో
మ్యూజియం అంటే పురాతన వస్తువులు, రాతిపనిముట్లు, విరిగిపోయిన కళాఖండాల వంటివి ఉండటం సహజం. కానీ అందుకు భిన్నంగా బ్రిటిష్ శిల్పకళాకారుడు జాసన్ డెకైర్స్ టేలర్ మాత్రం సముద్ర తీరప్రాంతాన్ని కాపాడుకోవాలంటూ.. సమాజాన్ని చైతన్యపరిచేలా శిల్పాలతో ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశాడు.
ఇది స్పెయిన్లోని లాంజరోట్ సముద్ర తీర కెనరీ దీవుల మధ్య ఈ మ్యూజియం ఉంది. దీనిపేరు మ్యూజియో అట్లాంటికో. ఐరోపా ఖండంలోనే నిర్మించిన మొదటి శిల్ప మ్యూజియం. ఇది అట్లాంటిక్ సముద్రంలో 15 మీటర్ల లోతులో ఉంటుంది. అచ్చంగా మనుషుల్లాగా ఉండే 300 విగ్రహాలతో సందేశాత్మకంగా 12 రకాల నమూనాలతో ఈ మ్యూజియం రూపుదిద్దుకుంది. ఈ ప్రదర్శనశాల చూడటానికి ప్రవేశ రుసుం ఉంటుంది.
ఈ మ్యూజియంలో కొన్ని శిల్పాలు ఒక ద్వారం వైపుగా నడుస్తున్నట్టు, కట్టెలపై మనిషి, రహస్యంగా ఫోటో తీస్తున్న ఛాయాగ్రాహకుడు. చుట్టూ ప్రహారీగోడ దానికొక చిన్న ద్వారం, 100 టన్నుల బరువుతో ఉండే ఈ నిర్మాణం మ్యూజియంలో అతిపెద్దది. సముద్రంలో మార్పులను ప్రతిబింబించే శిల్పాలు ఉంటాయి. ఇంకా నమూనాల మధ్య నీటిలో చేపలు గుంపులుగా కదులుతుంటే ఆశ్చర్యానికి గురిచేస్తాయి. చేపలు మెరుపు వేగంతో వెళ్లడం చూడటానికి చాలా బాగుంటుంది.
'కెన్క్యున్' మ్యూజియం
మెక్సికోలోని రివియెర మాయా సముద్రగర్భంలో ఉందీ మ్యూజియం. సముద్ర తలం నుంచి 28 అడుగుల లోతులో దాదాపు 500 శిల్పాలున్నాయి. సముద్రపు అడుగున ఉన్న మ్యూజియాల్లో ఇది అతి పెద్దది కావడం విశేషం. ఈ విగ్రహాలను చూడాలంటే స్కూబా డైవింగ్ రావాల్సిందే. రంగు రంగుల చేప పిల్లలు, రకరకాల జలచరాలు.. వాటి మధ్యలో వివిధ భంగిమల్లో ఆకట్టుకునే శిల్పాలు.. అదో అద్భుత ప్రపంచం.
మ్యూసా అనే స్వచ్ఛంద సంస్థ ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేసింది. ఈ మ్యూజియానికి సమీపంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. మెసోమెరికన్ పగడపు దిబ్బలుగా వీటిని పిలుస్తారు. ప్రపంచంలోనే రెండో అతి పెద్ద పగడపు దిబ్బలు ఇవి. సుమారు 1000 కిలోమీటర్ల విస్తీర్ణంలో పగడపు దిబ్బలు ఉన్నాయి. ఈ పగడపు దిబ్బలను కాపాడుకోవటం కోసం 2009లో ఈ మ్యూజియాన్ని మ్యూసా ఏర్పాటు చేసింది. స్కూబా డైవర్లు, ఇతరులు సముద్రంలో ప్రవేశించినపుడు వారి దష్టిని మళ్లించడానికే వీటిని నిర్మించింది.
మనతీ, సొరచేపలు, తిమింగలాల వంటి అతి పెద్ద జలచరాలకు ఈ పగడపు దిబ్బలు నిలయం.
దాదాపు 500 శిల్పాలను సముద్ర గర్భంలో ఏర్పాటు చేశారు. ఈ శిల్పాలను మెరైన్ గ్రేడ్ సిమెంట్తో తయారు చేశారు. టేలర్ అనే శిల్పి ఈ శిల్పాలను రూపొందించాడు. అతనికి మరో ఐదుగురు శిల్పులు సహకారమందించారు.
ఈ శిల్పాల్లో సామాన్య మానవులు, టీవీ యాంకర్లు, గాయకులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రకరకాల పనులు చేసే వాళ్లవి ఉన్నాయి. బ్యాంకు ఉద్యోగులను చమత్కరిస్తూ కొన్ని శిల్పాలను తయారు చేశారు. కారు, సైకిల్ వంటి వాహనాలను పోలిన శిల్పాలు ఇక్కడున్నాయి. చిన్న చిన్న జలాచర జీవులు ఆవాసం ఉండేందుకు ప్రత్యేకంగా కారును తయారు చేశారు. సంగీత పరికరమైన పియానోను చూస్తే అది నిజమైంది కాదంటే నమ్మబుద్ధి కాదు. అంత అందంగా దాన్ని రూపొందించారు.
Authorization