నిన్న మొన్నటి కాలం వరకు గ్రామీణ ప్రాంతాలలో మురికి నీటిని తేర్చేందుకు బిందెనీటిలో కొద్దిగా పటిక పొడిని కలిపేవారు. నీటిలో తేలియాడే మట్టి కణాలను వేరు చేసి నీటిని తేటగా మార్చడానికి పటిక లేదా అలమ్ వేసినప్పుడు దానిలోని అల్యూమినియం పదార్థం కారణంగా నీటిలోని అయాన్లు పటిక నుంచి విడిపోతాయి. ఏదైనా పదార్థం అయానుగా మారితే ఆ పదార్థంలోని అణువులు లేదా పరమాణువులు ధన లేదా రుణ విద్యుత్ఆవేశాలను కలిగి ఉంటాయి. ఈ రకమైన అల్యూమినియం అయాన్ నీటిలోని అణువులలో సంయోగం చెంది పాక్షిక ఘన స్థితిలో ఉండే జెల్.. అంటే జిగురులాంటి పదార్థంగా మారుతుంది. చిన్నచిన్న ముక్కలుగా ఉన్న ఈ జెల్ నీళ్లలో తేలే అతి సూక్ష్మమైన దుమ్ముధూళి రేణువులను ఆకర్షిస్తుంది. ఈవిధంగా ఆకర్షించటం వలన ఆ జెల్ ముక్కలు బరువెక్కి పాత్రలోని అడుగు భాగానికి చేరి నీరు తేటగా మారుతుంది.అందువల్ల మురికినీటిలోని దుమ్ముధూళి తొలగించటానికి పటికను ఉపయోగిస్తారు. వర్షాకాలంలో అధిక వర్షాల కారణంగా భూమి పైపొరలు నీటితో పాటు కొట్టుకుని రావడం వల్ల నీరు అపరిశుభ్రంగా బురద లేదా మురికితో నిండి ఉంటాయి. ముఖ్యంగా మంచినీటి కోసం చెరువులపై ఆధారపడే ప్రాంతాలలో ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. బురద లేదా మురికి నీటిని సేవించడం చాలా ప్రమాదకరం.
Authorization