Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రుణ రహిత కంపెనీగా రిలయన్స్
- 43వ ఏజీఎంలో ముకేశ్ అంబానీ వెల్లడి
ముంబయి : జియో ప్లాట్ఫామ్స్లో టెక్నాలజీ దిగ్గజం గూగుల్ రూ.33,737 కోట్ల పెట్టుబడి పెట్టనుందని రిలయన్స్ ఇండిస్టీస్ చైర్మెన్ ముకేశ్ అంబానీ వెల్లడించారు. తద్వారా జియోలో 7.7 శాతం వాటాను సొంతం చేసుకోనుందన్నారు. రిలయన్స్ ఇండిస్టీస్ వాటాదారుల 43వ వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం) బుధవారం జరిగింది. కరోనా నేపథ్యంలో తొలిసారిగా రిలయన్స్ వర్చువల్ సమావేశంలో ముకేశ్ మాట్లాడుతూ జియో వ్యూహాత్మక భాగస్వామిగా గూగుల్ కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు జియో ప్లాట్ఫామ్స్లోకి రూ.2.12 లక్షల కోట్ల కొత్త పెట్టుబడులు వచ్చాయన్నారు. ఫేస్బుక్, ఇంటెల్, క్వాల్కామ్ తదితర టెక్నాలజీ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ ప్రయివేట్ ఈక్విటీ సంస్థలు, వెంచర్ ఫండ్స్ జియోలో వాటాలు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.
రిలయన్స్ అభివృద్ధిలో దూసుకుపోతోందన్నారు. 150 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను సాధించిన తొలి కంపెనీగా రిలయన్స్ చరిత్ర సృష్టించిందన్నారు. పెట్టుబడుల సమీకరణ లక్ష్యాన్ని విజయవంతంగా చేరుకున్నామని తెలిపారు. దేశంలోనే అత్యధికంగా వస్తు సేవల పన్ను చెల్లించామన్నారు. వాటాదారులకు ఇచ్చిన హామీ ప్రకారం గడువుకు ముందే రుణ రహిత కంపెనీగా మార్చామన్నారు. కరోనా తర్వాత భారత్, మిగిలిన ప్రపంచ దేశాలు వేగంగా కోలుకుంటాయని అభిప్రాయపడ్డారు. గూగుల్తో వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా అందుబాటు ధరల్లో 4జీ, 5జీ ఫోన్లను తయారు చేనున్నట్లు తెలిపారు. అదే విధంగా దేశీయ వినియోగం కోసం ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను రూపొందించనున్నట్లు వివరించారు. రానున్న 5-7 ఏండ్ల కాలంలో దేశీయంగా రూ.75వేల కోట్ల పెట్టుబడులకు సిద్దంగా ఉన్నామని సోమవారం గూగుల్ సీఈఓ సుందర్ పిచారు ప్రకటించిన విషయం తెలిసిందే.