Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మార్చి నాటికి 14.7 శాతానికి..
- ఆర్బీఐ రిపోర్ట్లో అంచనా
ముంబయి : భారత బ్యాంకుల్లో మొండి బాకీలు అమాంతం పెరగనున్నాయని ఆర్బీఐ బాంబ్ పేల్చింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి అన్ని బ్యాంక్ల స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్పీిఎ) ఏకంగా 12.5 శాతానికి ఎగిసే అవకాశాలున్నాయని ఆర్బిఐ శుక్రవారం తన ఫైనాన్సీయల్ స్టెబిలిటీ రిపోర్ట్ (ఎఫ్ఎస్ఆర్)లో వెల్లడించింది. 2020 మార్చి నాటికి 8.5 శాతం మొండి బాకీలు నమోదయ్యాయని పేర్కొంది. పరిణామాలు మరింత విషమించితే 2021 మార్చి నాటికి ఎన్పిఎలు ఏకంగా 14.7 శాతానికి చేరే అవకాశాలు కూడా ఉన్నాయని ఈ రిపోర్ట్ పేర్కొంది. సూక్ష్మ గణంకాలు అత్యంత పేలవంగా నమోదైతే నిరర్ధక ఆస్తులు 620 బేసిస్ పాయింట్లు (అదనంగా 6.2%) ఎగిసే ప్రమాదం ఉందని తెలిపింది. బ్యాంక్ల రుణ పుస్తకాలు వాటి మూలధన నిల్వలను హరించే అవకాశాలున్నాయని పేర్కొంది. చాలా అవసరమున్న కంపెనీలకు కూడా రుణాలు జారీ చేయలేని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోనున్నాయని విశ్లేషించింది. ఈ పరిణామాలు బ్యాంకింగేతర విత్త సంస్థలు (ఎన్బీఎఫ్సీ), గృహ రుణాలు అందించే సంస్థలపై తీవ్రంగా పడనుందని తెలిపింది. ఆయా సంస్థలకు బ్యాంక్ల నుంచి మూలధనం అందక ఒత్తిడికి గురి కావొచ్చని పేర్కొంది.