Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెట్టింపైన కేటాయింపుల భారం
న్యూఢిల్లీ : ప్రముఖ ప్రయివేటు రంగ విత్త సంస్థ ఐసిఐసిఐ బ్యాంక్ ఆర్ధిక ఫలితాలు మార్కెట్ అంచనాలను చేరలేకపోయింది. 2020 జూన్తో ముగిసిన త్రైమాసికంలో మొండి బాకీల కోసం అధిక కేటాయింపులు చేసింది. మరోవైపు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, ఐసిఐసిఐ లంబార్డ్లో వాటాల విక్రయం ద్వారా వచ్చిన రూ.3036 కోట్ల ఏక కాల నిధుల వల్ల లాభాల్లో పెరుగుదలను నమోదు చేసింది. శనివారం ప్రకటించిన ఆర్ధిక ఫలితాల్లో జూన్తో ముగిసిన త్రైమాసికంలో 36 శాతం వృద్ధితో రూ.2,599 కోట్ల నికర లాభాలు నమోదయ్యాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.1,908 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో మొండి బాకీల కోసం రూ.3,495.73 కోట్ల కేటాయింపులు చేయగా.. గడిచిన త్రైమాసికంలో రూ.7,593.95 కోట్ల కేటాయింపులు జరిపింది. కరోనా విజృంభణ వల్ల అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఖాతాదారుల లావాదేవీలు ఆశజనకంగా లేకపోవడంతో జూన్ త్రైమాసికంలో ఫీజుల రూపంలో వచ్చే ఆదాయం 30.76 శాతం పతనమై రూ.2,104 కోట్లకు పరిమితమయ్యింది. గతేడాది ఇదే జూన్ త్రైమాసికంలో రూ.3,039 కోట్ల ఆదాయం నమోదయ్యింది. మార్చి త్రైమాసికంలో రుణాల జారీలో 13 శాతం పెరుగుదల చోటుచేసుకోగా.. జూన్ త్రైమాసికంలో ఇది 10 శాతానికి పడిపోయింది.