Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్ధిక ఒత్తిడిలో ఎంఎస్ఎంఇలు
- కొత్త రుణాలు అంతంతే
న్యూఢిల్లీ : సరైన ముందు చూపు లేకుండా దేశ వ్యాప్తంగా అమలు చేసిన లాక్డౌన్ వల్ల ఆర్ధిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోవడంతో చిన్న పరిశ్రమల పరిస్థితి అధ్వానంగా తయారయ్యింది. ఆయా సంస్థలు తీసుకున్న రుణాలు చెల్లించలేక మెజారిటీ సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) మారటోరియంను ఎంచుకున్నాయి. ఈ సంస్థలు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి కొత్త రుణాలు పుట్టడం లేదు. దేశ వ్యాప్తంగా వివిధ వర్గాల రుణ గ్రహీతల కోసం ప్రకటించిన మారుటోరియంలో గరిష్ట వాటా ఎంఎస్ఎంఇలదే కావడంతో వీటి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ఆర్బీఐ గణంకాల ప్రకారం.. ఏప్రిల్ 30తో ముగిసిన కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంక్ల్లో మొత్తం ఎంఎస్ఎంఈల్లో 82 శాతం మారటోరియాన్ని అవకాశంగా ఉపయోగించుకున్నాయి. కార్పొరేట్లు 58 శాతం, వ్యక్తిగత రుణాల్లో 80 శాతం రుణ వాయిదా పద్దతిని ఎంచుకున్నారు. అదే ప్రయివేటు రంగ బ్యాంక్ల్లో ఎంఎస్ఎంఈలు 43 శాతం, కార్పొరేట్లు 20 శాతం, వ్యక్తిగత రుణ గ్రహీతలు 34 శాతం చొప్పున మారటోరియం అవకాశాన్ని తీసుకున్నారు. కాగా ఎన్బీఎఫ్సీల్లో అప్పులు పొందిన వారిలో కార్పొరేట్లు 56 శాతం, ఎంఎస్ఎంఈలు 61 శాతం, వ్యక్తిగత గ్రహీతలు 46 శాతం చొప్పున రుణ చెల్లింపులను వాయిదా వేసుకున్నారు.
మొత్తం జీడీపీలో 29 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దాదాపుగా 11 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుంది. మొత్తం ఎగుమతుల్లో సగం వాటా వీటిదే. దేశంలో మొత్తంగా 90.19 లక్షల ఎంఎస్ఎంఈలు నమోదై ఉన్నాయి. ఎంఎస్ఎంఈలు తీవ్ర రుణ లభ్యత సవాళ్లను ఎదుర్కొంటున్నాయని ఆ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. చిన్న పరిశ్రమలకు 59 నిమిషాల్లో రుణాలు ప్రోగ్రామ్ ఆచరణలో నోచుకోవడం లేదని పేర్కొంటున్నాయి. ఆత్మనిర్బార్ ప్యాకేజీలోనూ ఆర్బాటంగా రూ.3 లక్షల కోట్లు ప్రకటించినప్పటికీ.. వాస్తవంగా కేటాయింపులు, రుణ లభ్యత నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆయా సంస్థల ఆర్ధిక పరిస్థితులు చాలా బాగుంటే తప్పా బ్యాంక్లు కనికరించడం లేదని వ్యాపారులు వాపోతున్నారు.