Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెండేండ్లుగా ఆర్థిక వ్యవస్థలో తీవ్ర స్తబ్దత
- ఇప్పట్లో 5ట్రిలియన్ డాలర్లకు చేరలేదు
- కరోనాకు ముందే జీడీపీ పతనం
నవతెలంగాణ - వాణిజ్య విభాగం
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ పరుగులు పెడుతోందని గతేడాది చివరి వరకు పదే పదే పేర్కొన్న ప్రధానీ మోడీ, ఆయన అనుచరగణం వ్యాఖ్యలు ప్రకటనలుగానే మిగిలిపోనున్నాయని స్పష్టమవుతోంది. 2025 నాటికి ఆర్థిక వ్యవస్థను రెట్టింపు చేసి 5 లక్షల కోట్ల డాలర్ల (రూ.375 లక్షల కోట్లకు) చేర్చుతామన్న విశ్వాసానికి తూట్లు పడుతున్నాయి. ప్రభుత్వ చర్యల వల్ల గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక వ్యవస్థ తీవ్ర స్తబ్దతలోకి జారుకోవడమే ఇందుకు నిదర్శనం. 2019 ముగింపు నాటికి 2.9 లక్షల కోట్ల డాలర్లు (దాదాపు రూ.225 లక్షల కోట్లు)గా ఉంది. మోడీ ఆధ్వర్యంలో బీజేపీ రెండో సారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2016 నవంబర్లో అనుహ్యాంగా ప్రకటించిన నోట్ల రద్దు.. ఆర్థిక వ్యవస్థను ఊహించని రీతిలో దెబ్బతీసింది.
రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ప్రతిష్టకు పోయి అంకెల గారడి చేసి రెండు, మూడు త్రైమాసికాలు మాత్రం జీడీపీలో పెరుగుదలను చూపించిందనే విమర్శలు ఉన్నాయి. ఆ తర్వాత క్రమంగా వృద్థి రేటు పడిపోతూనే ఉంది. దీనికి తోడు కరోనా వైరస్ వల్ల 2020 జూన్ త్రైమాసికంలో ఏకంగా మైనస్ 24 శాతానికి క్షీణించింది. కాగా ప్రతీ ఏడాది 8 శాతం పైగా వృద్థి రేటు సాధించి 2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్లకు ఆర్థిక వ్యవస్థను చేర్చడం ద్వారా ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ధనవంత దేశంగా మారుతామన్న బిజెపి ప్రభుత్వ ప్రకటన అలాగే మిగిలిపోనుంది. మోడీ సర్కార్ లక్ష్యం ఇప్పట్లో సాధ్యపడదనీ.. చేరుకోలేదని బ్లూమ్బర్గ్ తాజాగా ఓ కథనంలో విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ రెండంకెల స్థాయిలో క్షీణించనుందని ఇప్పటికే ఆర్బీఐ, ఎస్బీఐ, నొమురా హోల్డింగ్స్, మూడీస్ లాంటి ప్రభుత్వ, ప్రభుత్వేతర కీలక ఎజెన్సీలు అంచనా వేశాయి. వచ్చే ఏడాది తొలి త్రైమాసికం వరకు గడ్డు పరిస్థితులే కొనసాగొచ్చని విశ్లేషిస్తున్నాయి. ప్రయివేటు పెట్టుబడుల్లోనూ ప్రతికూల వృద్థి కొనసాగనుందని పేర్కొంటున్నాయి.
ఇది వరకు సంక్షోభాల నుంచి బయటపడి మెరుగైన వృద్థి రేటు నమోదు చేయడానికి పదేండ్లు పట్టిందని ఎస్బీఐ చీఫ్ ఎకనామిస్ట్ సౌమ్య కాంతి ఘోష్ పేర్కొన్నారు. గతంలో మాదిరిగా ఇకపై భారత్కు 5 శాతం వృద్థి రేటు సరిపోదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతీ ఏడాది కొత్తగా కోటి మంది యువత వస్తున్నారని.. వారికి ఉపాధి కల్పన పెరగాలంటే ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు. అందకనుగుణంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉండాలని సూచిస్తున్నారు.
పూర్తి నష్టాన్ని గుర్తించలేదు : ప్రణబ్ సేన్
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్తో ముగిసిన త్రైమాసికం జీడీపీ గణంకాల్లో ఆర్థిక వ్యవస్థకు జరిగిన పూర్తి నష్టాన్ని గుర్తించలేదని జాతీయ గణంకాల శాఖ మాజీ చీఫ్ ప్రణబ్ సేన్ అన్నారు. లాక్డౌన్ కాలంలో ప్రభావితమైన అనేక రంగాలను విస్మరించారని ఓ ఇంటర్యూలో పేర్కొన్నారు. లిస్టెడ్ కంపెనీల గణంకాలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారనీ, అన్లిస్టెడ్, చిన్న సంస్థల నష్టాలను గుర్తించలేదని అనుమానం వ్యక్తం చేశారు. సెబీ నిబంధనల సడలింపులతో లిస్టెడ్ కంపెనీలకు సంబంధించి కూడా అనేక సంస్థలు ఆర్థిక ఫలితాలను ప్రకటించలేదని.. ఆ గణంకాలు కూడా పరిగణలోకి తీసుకొని ఉండరని పేర్కొన్నారు. అసంఘటిత రంగానికి సంబంధించి శాంపల్ సర్వే చేసి ఉంటారన్నారు. గత 40 ఏండ్లలో ఎప్పుడూ లేని విధంగా జూన్ త్రైమాసికంలో జీడీపీ మైనస్ 24 శాతం పతనమైనట్లు సోమవారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. మోడీ సర్కార్ ఎన్నికైన తొలిసారి నుంచి కూడా జీడీపీ గణంకాల్లో మాయాజాలం చేస్తుందనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.