Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేటింగ్ ఏజెన్సీల ప్రతికూల ప్రకటనలు
- బిడ్ల దాఖలుకు పలుసార్లు గడువు పెంపు
- లాబీయింగ్లో కార్పొరేట్లు
నవతెలంగాణ - వాణిజ్యవిభాగం
ప్రభుత్వ రంగంలోని భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్)ను చౌకగా కొట్టెయ్యడానికి కార్పొరేట్ల ఎత్తుగడలు సాగుతున్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దేశీయ రెండో అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ విక్రయానికి గాను బిడ్డింగ్ దరఖాస్తు గడువును కేంద్ర ప్రభుత్వం వరుసగా మూడో సారి పెంచడం వెనుక బీపీసీఎల్ విలువను తక్కువ చేసే ప్రయత్నం జరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రేటింగ్ ఏజెన్సీలు కంపెనీల విలువ కోల్పోయేలా ప్రతికూల ప్రకటనలు చేస్తున్నాయి. ఫిచ్ రేటింగ్స్ ఇటీవల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. బీపీసీఎల్ ప్రయివేటీకరణలో బిడ్డర్లకు కావాల్సినంత సమాచారం అందుబాటులో లేనందున కొనుగోలుకు ఏ కంపెనీ ఆసక్తి చూపడం లేదని పేర్కొంది. ఇలాంటి అనుకోని సంఘటనల ద్వారా నష్టం పరిణమించవచ్చని తెలిపింది. భవిష్యత్ అంచనా 'ప్రతికూలం'గా ఉండొచ్చని విశ్లేషణలు సంస్థ పరపతిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్(దీపం) వరుసగా మూడో సారి బిడ్డింగ్ దాఖలకు గడువు పెంచుతూ.. సెప్టెంబర్ 31 వరకు అవకాశం కలిపించింది. పలు సార్లు జాప్యం చేయడంలో కార్పొరేట్లు లాబీయింగ్కు పాల్పడుతున్నారనే అనుమానాలు బలపడుతున్నాయి. బీపీసీఎల్ను ఎవరూ కొనడానికి ముందుకు రాకపోవడంతో తుదకు చౌకగా విక్రయించాల్సి వచ్చిందనే భావనను ప్రజల్లో తీసుకువచ్చేలా చేస్తుందనే విమర్శలు పెరుగుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థలకు ఈ బిడ్డింగ్లో పాల్గొనే అవకాశం కల్పించకపోవడం పట్ల కార్పొరేట్ల లాబీయింగ్ దాగి ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. భారీ లాభాల్లోని ఈ ప్రభుత్వ రంగ సంస్థ విక్రయాన్ని ఆ కంపెనీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. బీపీసీఎల్లో కేంద్ర ప్రభుత్వానికి ఉన్న 52.98 శాతం వాటాను విక్రయించడానికి గతేడాది నవంబర్లో మోడీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. బిడ్డింగ్కు తొలుత మే 2వ తేదీని ముగింపు గడువుగా ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని జూన్ 13వరకు, మళ్లీ జులై 31 వరకు పొడిగించింది. మళ్లీ సెప్టెంబర్ చివరి వరకు పెంచుతూ ఇటీవల దీపం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బీపీసీఎల్ నాలుగు రిఫైనరీలను నిర్వహిస్తోంది. అవి మహారాష్ట్రలోని ముంబయి, కేరళలోని కొచ్చి, మధ్యప్రదేశ్ బైనలో, అసోంలోని నుమాలీఘర్లో ఉన్నాయి. ఈ నాలుగు రిఫైనరీలలో ఏడాదికి 38.3 మిలియన్ టన్నుల చమురును శుద్ధిచేస్తారు. ఇది దేశ చమురు శుద్ధి సామర్థ్యంలో 15 శాతం కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 15,177 పెట్రోల్ పంప్స్, 6,011 ఎల్పీజీ డిస్టిబ్యూటర్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటితో పాటు 51 ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.