Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెంచి చూపిస్తున్న 'ద్విచక్ర' కంపెనీలు
- వినియోగదారులు కొన్నవి తక్కువే
- డీలర్ల వద్దే అధిక స్టాక్
న్యూఢిల్లీ : కరోనా దెబ్బకు దేశీయ ద్విచక్ర వాహన పరిశ్రమ అత్యంత దీన పరిస్థితిని ఎదుర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్థం (హెచ్1)లో ఈ రంగం అమ్మకాలు ఏకంగా 38.3 శాతం పతనమై 59.8 లక్షల యూనిట్లకు పరిమితమయ్యాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కానీ.. మోటార్ సైకిళ్లు, స్కూటర్లు, మోపెడ్ల అమ్మకాలకు సంబంధించి కంపెనీలు చెప్పినదాని కంటే తక్కువగానే నమోదైనట్లు మింట్ ఓ కథనంలో వెల్లడించింది. దేశ వ్యాప్తంగా రీజినల్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల్లో (ఆర్టీఓ) రిజిస్టర్ అయిన వాటి సంఖ్యకు కంపెనీలకు ప్రకటించిన వాటికి భారీ తేడా ఉంది.
సాధారణంగా వాహన కంపెనీలు తమ పరిశ్రమ నుంచి దేశ వ్యాప్తంగా డీలర్కు చేరిన యూనిట్ల సంఖ్యను వెళ్లడిస్తాయి. వాస్తవానికి వినియోగదారులకు చేరిన అమ్మకాలకు, కంపెనీ లెక్కలకు భారీ తేడా ఉంటుంది. రవాణ కార్యాలయాల్లో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కేవలం 37.4 లక్షల యూనిట్లు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి. ఇవి పరిశ్రమ వర్గాలు ప్రకటించిన వాటిలో పోల్చితే 37.5 శాతం తక్కువ.
ది ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (ఎఫ్ఏడీఏ) ప్రతీ నెల రిజిస్ట్రేషన్ అయిన గణంకాలను ప్రకటిస్తుంది. ఇందులో అత్యంత కీలకమైన మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన అమ్మకాలను కలపడం లేదు. ఈ సంఖ్య కూడా తీసుకుంటే వాహన పరిశ్రమ, రిటైల్ అమ్మకాల్లో మరింత తేడా చోటు చేసుకోనుంది. ఈ మూడు రాష్ట్రాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లలో దాదాపుగా 20 లక్షల యూనిట్ల తేడా ఉంటుందని అంచనా.
పండగ సీజన్ పైనే ఆశలు..
కాగా ద్విచక్ర వాహన డీలర్లు తమ వద్ద 45-50 రోజులకు సరిపడ పెద్ద మొత్తంలో వాహనాలను నిల్వ ఉంచుకుంటారని ఎఫ్ఏడీఏ తెలిపింది. ఏప్రిల్ 1 నాటి నుంచి బిఎస్-6 నిబంధనలు అమల్లోకి రావడం.. అదే సమయంలో లాక్డౌన్ రావడంతో డీలర్లు కొత్త వాహనాలను పెద్దగా నిల్వ ఉంచుకోలేదు. తాజాగా పండగ సీజన్ మొదలవడంతో డీలర్లు ఎక్కువ స్టాక్ను పెట్టుకున్నారు. దీంతో పరిశ్రమ అమ్మకాల లెక్కలకు.. రిజిస్ట్రేషన్లకు భారీ తేడా ఉంది. గడిచిన ఏడెనిమిది మాసాల్లో వాహన అమ్మకాలకు పెద్దగా డిమాండ్ లేకపోయినప్పటికీ.. ప్రస్తుత పండగ సీజన్ అయినా తమను ఆదుకుంటుందేమోనని డీలర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు.