Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుబేరుల జాబితాలో 13వ స్థానానికి పతనం
- రిలయన్స్ షేర్ 18 శాతం క్షీణత
న్యూఢిల్లీ : భారత రిటైల్ రంగంలో గుత్తాధిపత్యానికి ప్రయత్నిస్తున్న రిలయన్స్ ఇండిస్టీస్ అధిపతి ముకేష్ అంబానీ సంపదకు ప్యూచర్ గ్రూపు ఒప్పందం సెగ పెడుతోంది. ప్యూచర్ గ్రూపు కొనుగోలుకు రిలయన్స్ ఒప్పందం కుదర్చుకోగా.. తమకు తెలియకుండా ఎలా అమ్ముతారంటూ అమెజాన్ అడ్డుపుల్ల వేయడంతో ఇటీవల కాలంలో రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ విలువ భారీగా పడిపోయింది. దీంతో ప్రపంచ సంపన్నుల జాబితాలో అంబానీ స్థానం దిగజారింది. ప్రపంచ అపార కుబేరుల్లో అంబానీ స్థానం 13కు పడిపోయిందని బ్లూమ్బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ శనివారం ఓ రిపోర్ట్లో వెల్లడించింది. ప్రస్తుతం ఆయన ఆస్తి సుమారు రూ.6.62 లక్షల కోట్ల (90 బిలియన్ డాలర్లు) నుంచి రూ.5.36 లక్షల కోట్ల (73.4 బిలియన్ డాలర్లు)కు పడిపోయింది. రిలయన్స్ షేర్లు 52 వారాల గరిష్టం నుంచి 18 శాతం పడిపోవడంతో ఆ సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ క్రమంగా తగ్గుతోంది. మరోవైపు వ్యవసాయ చట్టాలు అంబానీ, అదానీల కోసమే రూపొందించారంటూ.. వాటిని వెనక్కి తీసుకోవాలంటూ దేశ వ్యాప్తంగా జరుగుతున్న రైతుల నిరసనలు ఆ కంపెనీ షేర్ను దెబ్బతీస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఫ్యూచర్ గ్రూప్ హోల్సేల్ ఆస్తుల కొనుగోలు ప్రకటనతో ఓ దశలో 52 వారాలా గరిష్ట స్థాయి రూ.2,369కి చేరిన రిలయన్స్ షేర్ అనంతరం అమెజాన్ సవాల్తో సుమారు 14 నుంచి 18.3 శాతానికి పడిపోయింది. టెలికం, రిటైల్ రంగాల్లో వాటాల విక్రయంతో రిలయన్స్ షేర్ విలువ గతేడాది మార్చిలో అత్యల్ప స్థాయి విలువ రూ.867.82 నుంచి 128 శాతం, 2020లో 32.2 శాతం మేర ఎగిసింది. ఫ్యూచర్స్ గ్రూప్ కొనుగోలు ఒప్పందాన్ని ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ సవాల్ చేయడంతో రిలయన్స్ పతనం మొదలైంది. గడిచిన డిసెంబర్ 10న ఈ షేర్ విలువ రూ.2,007 వద్ద ఉండగా.. జనవరి 8 నాటికి రూ.1,933.05కు పడిపోయింది.