Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెన్సెక్స్ 549 పాయింట్ల పతనం
- రూ.2.15 లక్షల కోట్ల సంపద ఆవిరి
ముంబయి : గత నాలుగు వారాల్లో ఎప్పుడూ లేని విధంగా దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతం రోజున భారీగా నష్టపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు తోడు గత కొన్ని రోజులుగా క్రమంగా పెరుగుతోన్న దేశీయ స్టాక్ మార్కెట్లలో అనుహ్యాంగా అమ్మకాలు చోటు చేసుకోవడంతో శుక్రవారం మదుపర్లు ప్రతీ నిమిషానికి రూ.575 కోట్ల చొప్పున నష్టపోయారు. ప్రధానంగా ఆటో, టెలికం రంగాలు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 549.49 పాయింట్లు లేదా 1.11 శాతం నష్టపోయి 49,034.67కు పడిపోయింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 161.90 పాయింట్లు పతనమై14,433.70 వద్ద ముగిసింది. ఇంట్రా డేలో సెన్సెక్స్ ఏకంగా 620 పాయింట్లు, నిఫ్టీ 180 పాయింట్ల మేర పతనమైంది. చివరి నిమిషాల్లో కొంత కోలుకున్నట్లు కనిపించిన భారీ నష్టాలతోనే ముగిశాయి. ప్రధానంగా ఇన్ఫోసిస్, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ బ్యాంక్ సూచీలు మార్కెట్లను ప్రతికూలతకు గురి చేశాయి. మదుపర్ల సంపద మొత్తంగా రూ.2.15 లక్షల కోట్లు ఆవిరయ్యింది.
ప్రధాన కారణాలు..
అమెరికా అధ్యక్షుడిగా ఈ నెల 20న బాధ్యతలు స్వీకరించనున్న జో బైడెన్ ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి 1.9 ట్రిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని ప్రతిపాదించారు. కాగా ఈ ప్యాకేజీ ఆశించిన మేర లేకపోవడం వాల్స్ట్రీట్ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా ఆసియా మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ పరిణామాలు భారత స్టాక్ మార్కెట్ల విశ్వాసాన్ని దెబ్బతీశాయి. మరోవైపు కొన్ని రోజులుగా స్టాక్ మార్కెట్లు వరుస లాభాలతో కొత్త రికార్డులను నమోదు చేయడంతో వారంతం ట్రేడింగ్లో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
లాభ.. నష్టాలు..
సెన్సెక్స్-30లో భారతీ ఎయిర్టెల్ 3.84 శాతం, ఐటిసి 1.77 శాతం, బజాజ్ ఆటో 0.18 శాతం, బజాజ్ ఫినాన్స్ 0.11 శాతం మినహా మిగితా సూచీలన్నీ నష్టాలు చవి చూశాయి. మరోవైపు టెక్ మహీంద్రా అత్యధికంగా 4 శాతం మేర నష్టపోగా.. ఇదే బాటలో హెచ్సిఎల్ టెక్, ఒఎన్జిసి, ఆసియన్ పెయింట్స్, అల్ట్రాటెక్, హెచ్డిఎఫ్సి షేర్లు అధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 1.17 శాతం కోల్పోయి 1937.60కు పడిపోయింది. నిఫ్టీ 50లోనూ ఏడు మాత్రమే లాభపడగా.. 43 సూచీలు ప్రతికూలతను ఎదుర్కొన్నాయి.