Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టాక్ మార్కెట్ల మాయలో పడొద్దు:రఘురాం రాజన్ హెచ్చరిక
న్యూఢిల్లీ : క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ ఇటీవల విపరీతంగా పెరగడాన్ని ఓ బుడగగా ఆర్బిఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ అభివర్ణించారు. టెస్లా షేర్ను ఉద్దేశించి స్టాక్ మార్కెట్ల మాయలో కూడా పడకూడదని సూచించారు. ''ఓసారి మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పరిశీలిస్తే... గతేడాది ప్రారంభంలో 10 వేల డాలర్లుగా ఉన్న బిట్ కాయిన్ విలువ బహుళ రెట్లు పెరిగి ప్రస్తుతం 40 వేల డాలర్లకు చేరుకుంది. వాస్తవానికి దీనికి ఎలాంటి విలువ ఉండదు. ఈ కరెన్సీ ద్వారా చెల్లింపులు చేయడమూ కష్టమే. భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఇన్వెస్టర్లు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే బిట్ కాయిన్పై పెట్టుబడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కానీ ఇది క్లాసిక్ బుడగ వంటిది'' అని రాజన్ పేర్కొన్నారు. క్రిప్టో కరెన్సీ విలువ ఎంతగా పెరిగినప్పటికీ దానికి నిజమైన విలువ లేదని, ఒక ఆస్తిగా దీనిని పరిగణించి చెల్లింపులు జరపడం కష్టసాధ్యమని పేర్కొన్నారు.
ఒకవేళ ప్రపంచం మరో సంక్షోభంలో చిక్కుకుంటే బిట్ కాయిన్తో పాటు టెస్లా కూడా గాలి బుడగ కానుందన్నారు. బుడగ వంటి మార్కెట్ ధోరణి, ద్రవ్యపరపతి విధానం, తక్కువ వడ్డీ రేట్లు వంటివి బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణమన్నారు. లగ్జరీ ఎలక్ట్రికల్ కార్ల తయారీదారు టెస్లా షేర్ల ధరల పెరుగుదలపై కూడా రాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది కాలంలో టెస్లా ఇంక్ స్టాక్స్ 750 శాతం వరకు పెరిగింది. రెండేళ్ల క్రితం 30 కి పైగా ర్యాంకులో ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద ఇప్పుడు ఏకంగా ప్రపంచంలోనే అతిపెద్ద సంపన్నుడుగా ఎదిగారు. కేవలం ఒక్క నెల రోజుల్లోనే టాప్ 10 నుంచి 4వ స్థానానికి, ఆ తర్వాత 3, 2, 1వ స్థానానికి ఎగబకారు. టోయాటా, జనరల్ మోటార్స్ లాంటి గట్టి కంపెనీలతో పోల్చితే టెస్లా బలహీనమైందన్నారు. బిఎస్ఇ సెన్సెక్స్ 50వేల పాయింట్ల మార్క్ను తాకవచ్చని రాజన్ అంచనా వేశారు. భారత ఐటి దిగ్గజ కంపెనీలు టిసిఎస్, విప్రో ఆర్థిక ఫలితాలు మార్కెట్లకు ప్రధాన మద్దతును అందిస్తున్నాయన్నారు. వేగాన్ని చూసి స్టాక్ మార్కెట్ల మాయలో పడొవద్దని హెచ్చరించారు. కరోనా సమయంలో కొన్ని పెద్ద కంపెనీలు మాత్రమే లాభపడ్డాయని, కానీ చిన్న పరిశ్రమలు, వ్యాపారాలు దెబ్బతిన్నాయని గుర్తు చేశారు.