Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో రోజూ వీడని నష్టాలు
- సెన్సెక్స్ 531 పాయింట్ల పతనం
- రూ.2.08 లక్షల కోట్ల సంపద ఆవిరి
- రిలయన్స్ షేర్ బెంబేలు
ముంబయి : అమ్మకాల ఒత్తిడితో వరుస నష్టాలతో దలాల్ స్ట్రీట్ బేజారు అవుతోంది. గత వారంలో నూతన రికార్డ్లను సృష్టించిన దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడు సెషన్లలో కుప్పకూలాయి. లక్షలాది కోట్ల సంపద హరించుకుపోవడంతో సగటు రిటైల్ మదుపర్లు బోరుమంటున్నారు. భారత్-చైనా మధ్య తాజా ఉద్రిక్తతలకు తోడు దేశ ఆర్థిక వ్యవస్థలోనూ పెద్ద సానుకూల పరిణామాలు ఏవీ కానరాకపోవడంతో సోమవారం బిఎస్ఇ సెన్సెక్స్ మరో 531 పాయింట్లు లేదా 1.09 శాతం కోల్పోయి ఏకంగా 48,347.6కు పడిపోయింది. వరుస మూడు సెషన్లలో బిఎస్ఇ సెన్సెక్స్ 1450 పాయింట్లు పడిపోయింది. గత నాలుగో నెలల్లో వరుస రోజుల్లో రికార్డ్ స్థాయిలో మార్కెట్లు పడిపోవడం ఇదే తొలిసారి. రిపబ్లిక్డే సందర్బంగా మంగళవారం భారత మార్కెట్లకు సెలవు. తిరిగి బుధవారం ట్రేడింగ్ కానున్నాయి.
వారం తొలి రోజు ఎన్ఎస్ఇ నిఫ్టీ 133 పాయింట్లు లేదా 0.93 శాతం క్షీణించి 14,239కి పడిపోయింది. బిఎస్ఇలో మిడ్ క్యాప్ 1.14 శాతం, స్మాల్ క్యాప్ 1.15 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్-30లో 9 సూచీలు మాత్రమే లాభపడగా.. మిగితా 21 స్టాక్స్ కూడా ప్రతికూలతను ఎదుర్కొన్నాయి. రిలయన్స్ ఇండిస్టీస్ 5.36 శాతం, ఇండుస్ఇండ్ బ్యాంక్ 4.72 శాతం, హెచ్సిఎల్ టెక్నలాజీస్ 3.80 శాతం, ఆసియన్ పెయింట్స్ 3.17 శాతం చొప్పున అధికంగా నష్టపోయిన వాటిలో టాప్లో ఉన్నాయి. మరోవైపు యాక్సిస్ బ్యాంక్ 2.19 శాతం, సన్ ఫార్మా 2 శాతం, బజాజ్ ఆటో 1.76 శాతం, బజాజ్ ఫిన్ సర్వ్ 1.47 శాతం చొప్పున అధికంగా లాభపడిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. నిఫ్టీలో రంగాల వారిగా ఫార్మా సూచీ మాత్రం 2 శాతం లాభపడింది. మరోవైపు రియాల్టీ, ఐటి సూచీలు 1 శాతం చొప్పున నష్టపోయాయి.
ముఖేష్ సంపద రూ.37వేల కోట్లు ఫట్
ముఖ్యంగా రిలయన్స్ ఇండిస్టీస్ షేర్ 5.36 శాతం కోల్పోయి 1,939.70కు పడిపోవడంతో మార్కెట్లపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ షేర్ బెంబేలెత్తడంతో ఒక్క పూటలనే ఆ కంపెనీ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సంపద 5.2 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.37వేల కోట్లు) హరించుకుపోయింది. 2020 డిసెంబర్తో ముగిసిన త్రైమాసికంలో రిలయన్స్ ఇండిస్టీస్ కంపెనీ ఆర్థిక ఫలితాలు మార్కెట్లను సంతృప్తిపర్చలేకపోవడం వల్ల మదుపర్లు అమ్మకాలకు మొగ్గు చూపారని నిపుణులు పేర్కొన్నారు.