Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ గవర్నర్ దాస్ వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా పట్టపగ్గాలు లేకుండా పెరిగిపోతున్న క్రిప్టో కరెన్సీల విలువపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆందోళన వ్యక్తం చేస్తోంది. బిట్ కాయిన్ లాంటి కరెన్సీ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీసే అవకాశాలున్నాయని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అన్నారు. ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామనీ, త్వరలోనే నిర్ణయం తీసుకోనుందన్నారు. దేశంలో ప్రయివేటు క్రిప్టో కరెన్సీ లావాదేవీలను పూర్తిగా నిషేధించి, సొంత డిజిటల్ కరెన్సీ తేవాలని కేంద్రం యోచిస్తోన్న విషయం తెలిసిందే. ఆర్బీఐ కూడా సొంతగా డిజిటల్ కరెన్సీ రూపకల్పనపై ఇప్పటికే అంతర్గత కమిటీని వేసింది. దీంతో ఇప్పటికే చైనాలోని ఎలక్ట్రానిక్ యువాన్తోపాటు డిజిటల్ కరెన్సీ ఉన్న ఇతర దేశాల జాబితాలో భారత్ చేరనుందని దాస్ తెలిపారు. బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించాలంటూ ప్రముఖ బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేశ్ ఝున్ఝున్ కేంద్రానికి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. బిట్కాయిన్ ట్రేడింగ్ జూదం తీవ్రస్థాయికి చేరిందన్నారు. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులపై తనకు ఆసక్తి లేదని.. ఇన్వెస్టర్లు కూడా కాస్తంత జాగ్రత్తగా ఉండాలని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ హెచ్చరించిన విషయం తెలిసిందే.