Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.600 కోట్ల చొప్పున పెట్టుబడి
- ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (ఆర్అండ్డీ) వెల్లడి
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో రెండు ఇథనాల్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నామని ఇండియన్ ఆయిల్ డైరెక్టర్ (ఆర్అండ్డీ) డాక్టర్ ఎస్ఎస్వి రామకుమార్ తెలిపారు. బుధవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు ప్లాంట్లపై రూ.600 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టనున్నామని తెలిపారు. రోజుకు 5 లక్షల లీటర్ల సామర్థ్యంతో వీటిని అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. తెలంగాణలో ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన స్థలాన్ని సమకూర్చడానికి ఇక్కడి ప్రభుత్వం ముందుకు వచ్చిందనీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని వెల్లడించారు. స్థల కేటాయింపు తర్వాత ఏడాదిన్నరలో ఈ ప్లాంట్లను అందుబాటులోకి తేనున్నామని తెలిపారు. ఇంధన వినియోగంలో 2022 నాటికి ఇథనాల్ వాడకాన్ని 10 శాతానికి పెంచాలని.. 2025 నాటికి 15 శాతానికి చేర్చాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించిందన్నారు.
పదేండ్లలో ఇండియన్ ఎనర్జీ పంప్లు..!
ప్రస్తుతం ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపులు కనబడుతున్నాయని.. వచ్చే 10, 15 ఏండ్లలో వీటి రూపు రేకలు పూర్తిగా మారిపోనున్నాయని రామకుమార్ తెలిపారు. ఒకే చోట పెట్రోల్, డీజిల్తో పాటు ఇథనాల్, మిథేన్, బ్యాటరీ, ఎల్ఎన్జి, హైడ్రోకార్బన్ తదితర ఇంధనలను అందుబాటులోకి తేవడం ద్వారా ఇండియన్ ఎనర్జీ పంప్లుగా మార్చనున్నామన్నారు.
ఔత్సాహికవేత్తలకు బంఫర్ ఆఫర్
సహజ వ్యర్థాల నుంచి బయో గ్యాస్ను ఉత్పత్తి చేయడానికి ఔత్సాహికవేత్తలకు బంఫర్ ఆఫర్ను అందుబాటులోకి తెస్తున్నామని రామకుమార్ తెలిపారు. ఈ యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తులను స్వీకరించనున్నామన్నారు. ఎకరం స్థలం, రూ.3 కోట్ల పెట్టుబడితో బయో ప్లాంట్ను పెట్టుకోవచ్చన్నారు. ఇందులో ఉత్పత్తి అయ్యే ఇంధనాన్ని తామే కొనుగోలు చేయనున్నామనీ.. పెట్టుబడికి అవసరమయ్యే రుణాలను బ్యాంక్లు ప్రాధాన్యత రంగంలో అందించనున్నాయన్నారు. దీనికి సంబంధించిన పూర్తి టెక్నాలజీని తామే సమకూర్చుతామన్నారు. దీని ద్వారా వచ్చే కంప్రెష్డ్ బయో గ్యాస్ కిలోకు రూ.46 చెల్లించనున్నామన్నారు. ఇందులో ఉపయోగించే అత్యాధునిక టెక్నాలజీ ద్వారా 5వేల టన్నుల ఉత్పత్తి ప్లాంట్ను ఒక్కరితో నిర్వహించవచ్చన్నారు.
40 ఏండ్ల కింద రిఫైనరీల ఏర్పాటుకు రష్యా నుంచి తాము టెక్నాలజీని అందిపుచ్చుకున్నామనీ.. ఇటీవల తమ పరిశోధన, అభివృద్థి కేంద్రం ఆవిష్కరించిన టెక్నాలజీని అదే దేశానికి అందించగలుగుతున్నామని తెలిపారు. ఈ సమావేశంలో ఇండియన్ ఆయిల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల హెడ్ ఆర్ఎస్ఎస్ రావు, కార్పొరేట్ కమ్యూనికేషన్స్ చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ చిదంబరమ్ పాల్గొన్నారు.