Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఏడవ వేతన సంఘం సిపారసులకు తోడు గ్యాస్, చమురు, కన్సూమర్ గూడ్స్్ సూచీలు రాణించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో లాభాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ 26.57 పాయింట్లు లేదా 0.1 శాతం రాణించి 25,868.49 వద్ద నమోదయ్యింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజీ నిఫ్టీ 13.8 పాయింట్లు లేదా 0.18 శాతం పెరిగి 7,856.55 వద్ద ముగిసింది. సెన్సెక్స్-30లో గెయిల్ 10.07 శాతం, విప్రో 1.93 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.92 శాతం, డాక్టర్ రెడ్డీస్ 1.8 శాతం, మారుతి సుజుకి 1.94 శాతం చొప్పున పెరిగాయి. మరోవైపు సన్ఫార్మా 2.21 శాతం, ఐటిసి 2.17 శాతం, హిందాల్కో 1.53 శాతం, హీరో మోటో కార్ప్ 1.07 శాతం, టాటా మోటార్స్ 1.06 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.
కాగా బిఎస్ఇలో రంగాల వారిగా ఆయిల్ అండ్ గ్యాస్ సూచీ అత్యధికంగా 2.05 శాతం పెరిగింది. ఇదేక్రమంలో మౌలిక వసతులు 1.01 శాతం, కాపిటల్ గూడ్స్ 0.82 వాతం, ఐటి 0.69 శాతం చొప్పున మార్కెట్లకు మద్దతు చేశాయి.
మరోవైపు ఎఫ్ఎంసిజి 0.82 శాతం, రియాల్టీ 0.26 శాతం, బ్యాంకింగ్ 0.15 శాతం చొప్పున నష్టాలపాలయ్యాయి. ఇంతక్రితం సెషన్లో విదేశీ సంస్థాగత మదుపర్లు రూ.343.18 కోట్ల ఈక్విటీలను విక్రయించారని అంచనా. బిఎస్ఇలో మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు వరుసగా 0.86 శాతం, 0.61 శాతం చొప్పున పెరిగాయి.