Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెక్నోసిటీ ప్రాజెక్టు నుంచి వైదొలిగిన ఇన్ఫోసిస్
తిరువనంతపురం (కేరళ): కేరళాలోని టెక్నోసిటీ క్యాంపస్ నిర్మాణ ప్రాజెక్టును తాము ఉపసంహరించుకుంటున్నట్లు ఐటీ రంగ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ వెల్లడించింది. క్యాంపస్ ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించడంతో స్థానిక ప్రభుత్వం నుంచి సహకారం లోపించినందున తాము ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సంస్థ వెల్లడించింది. ఇక్కడ క్యాంపస్ ఏర్పాటు కోసం సంస్థ దాదాపు రూ.26 కోట్లను వ్యయం చేసింది. ఈ నెల 18న ఇన్ఫోసిస్ సంస్థ టెక్నోపార్క్ సీఈఓ గిరీష్ బాబు, రాష్ట్ర ఐటీ కార్యదర్శి పి.హెచ్.కురియన్లకు ఇన్ఫీ ఒక లేఖ రాస్తూ తమకు కల్పించాల్సిన మౌలిక వసతుల విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లు పేర్కొంది. దీనికి తోడు తమకు లీజుగా ఇచ్చిన దాదాపు 50 ఎకరాల స్థలంలో ఒక దేవాలయం కూడా ఉన్నట్లు సంస్థ పేర్కొంది. దీనికి గిరీష్ బాబు స్పందిస్తూ 2012లో ఇన్ఫోసిస్ రూ.47 కోట్లను చెల్లించి జీవితకాల లీజును పొందిందని, అయితే ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి నిర్మాణ కార్యక్రమాలను చేపట్టలేదని అన్నారు. ప్రభత్వం నుంచి తగిన సహకారం లేదన్న ఇన్ఫీ ఆరోపణలను తోసిపుచ్చిన గిరీష్ ఐటీ పార్క్లో నిర్మాణాలను ప్రారంభించేలా భూసేకరణ జరిపిన ప్రాంతంలో తాము అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇన్ఫీ అభ్యర్థన మేరకు టెక్నోపార్క్ 49.84 ఎకరాల భూమిని 2013 మార్చిలో ఐటీ సంస్థకు అందించినట్లు ఐటీ కార్యదర్శి కురియన్ తెలిపారు. నిబంధనల మేరకు లీజు తీసుకున్న తేదీ లేదా కనీసం స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు ఇన్ఫోసిస్ ఇక్కడ నిర్మాణ కార్యక్రమాలను ప్రారంభించాల్సిందని అన్నారు. అన్ని సౌకర్యాలు కల్పించినప్పటికీ ఇప్పటి వరకు తమకు ఇన్ఫోసిస్ ప్రతిపాదిత భవన నమూనాలను కూడా అందజేయలేదని ఆయన అన్నారు. అయితే కొత్త క్యాంపస్ స్థాపన విషయంలో కొంత విముఖంగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థ టెక్నోపార్క్నకు దగ్గరలో ఉన్న ఫేజ్-2లోని క్యాంపస్నే విస్తరించాలని చూస్తున్నట్లు సమాచారం.