Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 200 నగరాలకు విస్తరిస్తాం
- సంస్థ డైరెక్టర్ ఆనంద సుబ్రహ్మణ్యం
చెన్నై: ఏడాది చివరి నాటికి తమ సేవలను 200 నగరాలకు విస్తరించాలని ఆన్లైన్ క్యాబ్, ఆటో రిక్షా సేవల సంస్థ ఓఎల్ఏ సంస్థ యోచిస్తోంది. మరో వైపు ఓఎల్ఏ కేఫ్ పేరుతో చెన్నైలోని పలు రెస్టారెంట్ల సౌజన్యంతో డిమాండ్ మేరకు ఆహార పదార్థాలను ఇంటికి చేరవేసే వైపు కూడా విస్తరించే అవకాశాలను సంస్థ పరిశీలిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఓఎల్ఏ మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ ఆనంద సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రస్తుతం సంస్థ 100 నగరాలలో సేవలను అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి వీటిని 200 నగరాలకు చేర్చాలని తాము యోచిస్తున్నట్లు వివరించారు. అయితే ఇందుకు అవసరమైన నగదును ఏ విధంగా సమీకరించేది ఆయన వెల్లడించలేదు. రానున్న రోజుల్లో ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు తమ సేవలను విస్తరించనున్నట్లు తెలిపారు. కంపెనీ ప్రస్తుతం ముంబయి, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ నగరాలలో ఓఎల్ఏ కేఫ్ సేవలను ప్రయోగాత్మకంగా మొదలుపెట్టింది. వీటిని చెన్నైలో విస్తరించేందుకు తాము స్థానిక రెస్టారెంట్లతో జట్టు కడుతున్నట్లు ఆయన వివరించారు.