Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన త్రైమాసికానికి ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థ కోల్ ఇండియా నికర లాభం రూ.4238.55 కోట్లుగా నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో సంస్థ లాభంతో పోలిస్తే ఇది 4.41 శాతం (రూ.4,434.19 కోట్లు) తక్కువ. ఇదే కాలంలో సంస్థ నికర అమ్మకాలు 3.88 శాతం మేర పెరిగి రూ.20774.22 కోట్లకు చేరాయి. క్రితం సంవత్సరం సంస్థ విక్రయాలు రూ.19,997.98 కోట్లుగా ఉన్నాయి. ఉద్యోగి వ్యయం పెరగడం కారణంగా సంస్థ లాభాలలో కొంత క్షీణత నమోదు అయినట్లు కంపెనీ వెల్లడించింది. ఉద్యోగి లబ్ది వ్యయం 13.39 శాతం మేర పెరిగినట్లు కంపెనీ తెలిపింది. కాంట్రాక్ట్ వ్యయం 30.56 శాతం మేర పెరిగింది.
కొద్దిలో చేజారిన లక్ష్యం..
మార్చితో ముగిసిన 2014-15 ఆర్థిక సంవత్సరానికి కోల్ ఇండియా సమీకృత నికర లాభం 15,111.64 కోట్ల నుంచి రూ.13,726.62 కోట్లకు తగ్గింది. దీంతో పూర్తి ఆర్థిక సంవత్సరంలో సంస్థ లాభం 9.17 శాతం తగ్గినట్లయింది.
ఇదే కాలంలో సంస్థ అమ్మకాలు 4.66 శాతం మేర పెరిగి రూ.72,014.52 కోట్లకు చేరింది.
507 మిలియన్ టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని సంస్థ 3% కొరతతో చేజార్చుకుంది. కాగా కోల్ ఇండియా వాటాలు గురువారం 0.7 వృద్ధితో రూ.383.10 వద్ద ముగిశాయి.