Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందుకు రేయింబవళ్లు కృషి చేద్దాం
- అదనపు సిబ్బందితో రాత్రిపూటా పనులు చేయండి
- నిర్మాణ పనుల సమీక్షలో సంస్థ సీఎండీ శ్రీధర్
నవతెలంగాణ-హైదరాబాద్: సింగరేణి థర్మల్ విద్యుత్తు కేంద్ర రెండో యూనిట్ నిర్మాణ పనులను జనవరి నాటికి పూర్తి చేసేందుకు అధికారులు, కార్మికులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులు నిర్వరామంగా కృషి చేయాలని సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్ అన్నారు. ఆదిలాబాద్లోని జైపూర్ వద్ద నిర్మస్తున్న సింగరేణి కాలరీస్ థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణ పనులను సీఎండీ గురువారం ఇక్కడి సింగరేణి భవన్లో సమీక్షించారు. ముందుగా బీహెచ్ఈఎల్ పనులను ఆయన అంశాల వారీగా సమీక్షించారు. ఒకటో యూనిట్లో బాయిలర్ లైటప్ జూన్లో, రెండవ యూనిట్లో జులైలో జరగనున్న నేపథ్యంలో స్విచ్యార్డ్ పనులను మరింత వేగవంతం చేయాలని అన్నారు. రెండో యూనిట్లో మందకొడిగా సాగుతున్న సివిల్ పనులను సత్వరమే పూర్తి చేయాలని సీఎండీ ఆదేశించారు. ఎట్టిపరిస్థితులలోనూ 2016 జనవరి నాటికి సింగరేణి కాలరీస్ థర్మల్ విద్యుత్తు కేంద్రం నుంచి తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్తు అందాలంటూ ఆయన అధికారులకు దిశానిర్ధేశం చేశారు. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్ నిర్మాణ పనులను చేపడుతున్న మెక్నెల్లీ భారత్ అధికారులతో చిమ్నీ పనుల గురించి వివరంగా చర్చించారు. 25 మీటర్ల ఎత్తయిన చిమ్నీ నిర్మాణం పూర్తయినందున దాని అంతర్భాంగ నిర్మాణ పనులను కూడా వీలైనంత త్వరలోనే పూర్తి చేయాలని ఆయన సూచించారు. పనులను వేగవంతం చేసేందుకు అవసరమైతే అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఆయన కంపెనీ ప్రతినిధులకు సూచించారు. త్వరలోనే వర్షాకాలం ప్రారంభం కానున్న తరుణంలో సివిల్ తదితర పనులలో వేగం పెంచాలని సీఎండీ సూచించారు. ఎక్కువ మందిని నియమించుకొని రాత్రివేళల్లో కూడా పనులు కొనసాగించాలని ఆయనఆదేశించారు.
సివిల్ పనులపై కూడా సమీక్ష..
సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్న సివిల్ పనుల్లో భాగంగా నిర్మిస్తున్న 100 క్వార్టర్ల నిర్మాణం, శ్రీరామ్పూర్ నుంచి పవర్ప్లాంట్ వరకు రొడ్డు వెడల్పు పనులు, శ్రీరామ్పుర్ నుంచి ఓ.సి. నుంచి పవర్ ప్లాంటు వరకు జరగాల్సిన రైల్వేలైను పననులలో పురోగతిని కూడా ఆయన ఈసందర్భంగా సమీక్షించారు.
వీటిని వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. సమావేశంలో సింగరేణి సంస్థ ప్రాజెక్ట్లు, ప్రణాళిక విభాగం డైరెక్టర్ ఎ.మనోహరరావు, ఈ అండ్ఎం విభాగం డైరెక్టర్ రమేష్ బాబు, సింగరేణి థర్మల్ ప్లాంటు ఈడీ సంజరుసూర్, జీఎంలు సుధాకర్ రెడ్డి, మురళీకృష్ణ, ఎన్టీపీసీ జీఎం శ్రీ మగన్, భెల్ అధికారి మాథూర్, మెక్నెల్లీ భారత్ సీసీఓ చంద్రతోపాటు 40 మంది అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.