Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రోత్సాహక యాప్ను ప్రారంభించిన ఎస్బీఐ
ముంబయి: బ్యాంకు 60వ వార్షికోత్సవం సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) సరికొత్త వినియోగదారు ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా సకాలంలో రుణాన్ని, నెల వాయిదాల చెల్లింపులను చేసిన వారిని ప్రోత్సహించేందుకు గాను బ్యాంకు 'స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్' అనే విధేయత కార్యక్రమాన్ని ప్రారంభించింది. కేవలం రుణ చెల్లింపులకే కాకుండా బ్యాంకు ఖాతాలను తెరవడం, విరివిగా డెబిట్ కార్డు వాడకం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, రూరల్ బ్యాంకింగ్, డిమాట్ ఖాతాలను తెరవడం వంటి కార్యక్రమాల ద్వారా కూడా పాయింట్లను పొందే వీలు కల్పించింది.
గూగుల్ ప్లేలో 'స్టేట్ బ్యాంక్ రివార్డ్జ్'ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా ఈ పాయింట్లను పొందవచ్చు. సరైన సమయంలో చెల్లింపులు జరిపే వినియోగదారులకు తమ వంతు కృతజతను తెలిపేందుకు గాను ఈ రివార్డ్ విధానాన్ని ఎంచుకున్నట్లుగా బ్యాంకు ఛైర్మన్ ఆరుంధతి బాట్టాచార్య తెలిపారు. నాలుగు పాయింట్లు కలిపితే ఒక రూపాయి అవుతుంది. వీటిని దేశంలోని దాదాపు 6000 వివిధ రకాల దుకాణాల ద్వారా మొబైల్ రీఛార్జింగ్, డీటీహెచ్ సేవలు, సినిమా, బస్, ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకొనేప్పుడు వాడుకోనే వీలుంటుంది. ఈ పాయింట్లను 36 నెలల లోపు వాడుకోవాల్సి ఉంటుంది లేకుంటే వాటి కాలపరిమితి తీరిపోతుంది.
పేదలకు వస్తు పంపిణీ
భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఆవిర్బావ దినోత్సవ వేడుకలు బుధవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్లో ఘనంగా జరిగాయి. ఈ ఏడాది ఆవిర్భావ దినోత్సవాన పేదలకు మేలు చేసే కార్యక్రమాలను చేపట్టింది స్థానిక ఎస్బీఐ ప్రధాన శాఖ. స్టేట్ బ్యాంక్ రికవరీ శాఖ వారి చొరవతో కోఠిలో ''స్ట్రీట్ స్టోర్'' కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా పేదలకు ఉచితంగా బట్టలు, పాదరక్షలు వంటి పలు సామగ్రిని పంచిపెట్టింది. దాదాపు 500 మంది ఈ కార్యక్రమం ద్వారా లబ్ది పొందారు. ఇలాంటి ''స్ట్రీట్ స్టోర్''ను నిర్వహించడం దేశంలోనే రెండోసారి అని, తెలుగు రాష్ట్రాలలో ఇదే ప్రప్రథమమని బ్యాంకు వర్గాలు తెలిపాయి. ''స్ట్రీట్ స్టోర్'' కార్యక్రమాన్ని ఎస్బీఐ డీఎండీ సి.ఆర్.శశి కుమార్ ప్రారంభించారు. ఏజీఎంలు బాలకృష్ణ, వామనరావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు సిబ్బంది ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పేదలకు సాయం అందించారు. -నవతెలంగాణ- వాణిజ్య విభాగం