Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకే రోజు రూ.990 ప్రియం
న్యూఢిల్లీ : అమెరికా విధానాలకు తోడు హరికేన్ ఇర్మా ప్రభావంతో ప్రపంచ మార్కెట్లో బంగారం ధర భగ్గుమంటుంది. ఈ ప్రభావం శుక్రవారం భారత బులియన్ మార్కెట్పై కూడా పడింది. ప్రస్తుత ఏడాదిలో ఎప్పుడూ లేని విధంగా శుక్రవారం ఒకే రోజు ఏకంగా రూ.990 పెరిగి రూ.31,350కి ఎగిసింది. ప్రపంచ మార్కెట్లోనూ బంగారం ధర ఏడాది గరిష్టానికి చేరింది. కాగా న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారంపై రూ.990 పెరిగి వరుసగా రూ.31,350, రూ.31,200గా నమోదయ్యింది. నవంబర్ 2016న బంగారం ధర ఈ స్థాయిలో పలికింది. కాగా కిలో వెండిపై రూ.100 పెరిగి రూ.42,000కు చేరింది. 100 వెండి నాణేల ధర యథాతథంగా రూ.74,000గా నమోదయ్యింది.
ప్రధాన కారణాలు..
పసిడి ధర అమాంతం పెరగడానికి ప్రధానంగా ట్రంపు నిర్ణయాలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచ మార్కెట్లో డాలర్ విలువ పడిపోవడంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అమెరికా, దక్షిణ కొరియా మద్దతుతో ఉత్తర కొరియాను కవ్వించడంతో ముందు జాగ్రత్తగా ఉత్తర కొరియా చేస్తున్న ఆయుధ ప్రయోగాలు ప్రపంచ మార్కెట్లో అనిశ్చిత్తిని పెంచుతున్నాయి. దీనికి తోడు అమెరికాలో ఉపాధి రేటు అంచనాల కంటే దిగువన నమోదు కావడం బంగారానికి డిమాండ్ కల్పిస్తోంది. సహజంగా సంక్షోభ పరిస్థితుల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు సురక్షితమైనదిగా పరిగణించే పసిడిపై పెట్టుబడులు పెడతారు. అంతర్జాతీయ కమోడిటీ ఎక్సేంజీలో గడిచిన రెండు నెలల్లో పసిడి ఔన్స్ (31.1 గ్రా) ధర దాదాపు 150 డాలర్లు పెరిగింది.