Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లకు ఆర్థిక గణాంకాలు, ఉత్తర కొరియా అంశాలు కీలకంగా మారనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రధానంగా ఈ వారంలో వెలువడే పారిశ్రామికోత్పత్తి, రిటైల్ ధరల ద్రవ్యోల్బణం, టోకు ధరల ద్రవ్యోల్బణ గణాంకాలు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతాయని వారు చెబుతున్నారు. వీటితోపాటు ప్రపంచ మార్కెట్ల పోకడ, విదేశీ పెట్టుబడుల సరళి, డాలరుతో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరల గమనం మన స్టాక్ సూచీల కదలికలను నిర్దేశిస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గత వారం అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాల కారణంగా స్టాక్ మార్కెట్లు పరిమిత స్థాయిలోనే కదలాడాయి. దీంతో పాటు ఉత్తర కొరియా సంక్షోభం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మదుపర్లు జాగ్రత్త పడటంతో పాటు పసిడివైపు దృష్టి సారించారు. దీంతో వారాంతంలో బీఎస్ఈ సెన్సెక్స్ 24.78 పాయింట్లు లాభపడి 31,687.52 వద్ద స్థిరపడింది. అలాగే ఎన్ఎస్ఈ నిప్టీ 4.9 పాయింట్లు పెరిగి 9,934.80 వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో ఈ వారం దేశీ స్టాక్ మార్కెట్ గమనం ఎలా ఉండనుందో వేచి చూడాలి..
ఐఐపీ, ద్రవ్యోల్బణం..
జులై నెలకు సంబంధించిన పారిశ్రామికోత్పత్తి గణాంకాలు (ఐఐపీ) మంగళవారం(12న) ప్రభుత్వం విడుదల చేయనుంది. జూన్లో ఐఐపీ 0.1శాతం క్షీణించింది. ఆగస్టు నెలకు చెందిన రిటైల్ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) గణాంకాల వివరాలు అదే రోజున మార్కెట్ ముగిసిన తర్వాత వెల్లడికానున్నాయి. జూలైలో సీపీఐ 2.36శాతానికి జంప్ చేసింది. కాగా జూన్ నెలలో ఇది 1.46శాతంగా ఉంది. ఇదే క్రమంలో ఆగస్టు నెల టోకు ధరల ద్రవ్యోల్భణం (డబ్ల్యూపీఐ) గణాంకాలను గురువారం(14న) ప్రభుత్వం ప్రకటించనుంది. జులై నెలలో డబ్ల్యూపీఐ 1.88శాతం పెరిగింది. జూన్లో 0.9శాతంగా నమోదైంది.
ఉత్తర కొరియా సంక్షోభం
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మార్కెట్ల చూపు ఇప్పుడు ఉత్తర కొరియా తదుపరి చర్యలపై దృష్టి పెట్టాయి. ప్రస్తుతం ఆ దేశం ఖండాతర క్షిపణిని (ఐసీబీఎం) పూర్తిస్థాయిలో ప్రారంభించడానికి సిద్ధమవుతున్నట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని దక్షిణ కొరియా మీడియా కూడా వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్యోంగ్యాంగ్ కార్యకలాపాలపై ఇన్వెస్టర్లు దృష్టి పెట్టవచ్చునని ఆర్థిక విశ్లేషకులు పేర్కొంటున్నారు.
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం..
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 21వ కౌన్సిల్ సమావేశానికి హైదరాబాద్ వేదికగా మారింది. శనివారం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో ప్రజలు రోజు ఉపయోగించే దాదాపు 30 వస్తువుల పన్ను శ్లాబ్లలో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే కార్ల సెస్తో పాటు జులై నెల జీఎస్టీ రిటర్న్ల దాఖలుకు గడువు పెంచడం, జీఎస్టీఎన్ నెట్వర్క్, ఐటీ సమస్యలు, రిటర్న్ల దాఖలతో ఎదురువుతున్న ఇబ్బందుల సమీక్షీంచేందుకు అధికారుల కమిటీతో పాటు మంత్రులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక కార్లపై పన్ను రేట్లను పెంచిన నేపథ్యంలో సోమవారం నాటి ట్రేడింగ్లో సంబంధిత స్టాక్స్తో పాటు ఆయా రంగాల కౌంటర్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు విశ్లేసిస్తున్నాయి.
ఐపీవోల సందడి ..
స్టాక్ మార్కెట్లో రోజురోజుకి ఐపీవోల సందడి పెరిగిపోతుంది. గతవారం నిధుల సమీకరణ కోసం స్టాక్ మార్కెట్లోకి వచ్చిన డిక్సన్ టెక్నాలజీస్, భారత్ రోడు నెట్ వర్క్ సంస్థలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా పెళ్లి సంబంధాలను కుదిర్చే భారత మాట్రిమోనీ.కామ్ పబ్లిక్ ఇష్యూ సోమవారం(11న) ప్రారంభంకానుంది. ఈ నెల 13న (బుధవారం) ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.983-985గా కంపెనీ నిర్ణయించింది. తద్వారా రూ.500 కోట్లు సమకూర్చుకోవాలని భావిస్తుంది. రియాల్టీ కన్స్ట్రక్షన్ సంస్థ కెపాసైట్ ఇన్ఫ్రాప్రాజెక్ట్సు పబ్లిక్ ఇష్యూ బుధవారం (13న) మొదలుకానుంది. ఈ నెల శుక్రవారం ముగియున్న ఈ ఐపీవో ధరల శ్రేణి రూ.245-250గా కంపెనీ నిర్ణయించింది. తద్వారా రూ.400 కోట్లు సమీకరించాలని యోచనలో కెపాసైట్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే బాటలో ఐసీఐసీఐ బ్యాంక్కు చెందిన ఐసీఐసీఐ లంబార్డ్ శుక్రవారం (15న) పబ్లిక్ ఇష్యూకి రానుంది. కాగా 19న ముగియనున్న ఇష్యూకి ధరల శ్రేణి రూ.651-661గా కంపెనీ నిర్ణయించింది.