Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్యాంకుల విలీనాలతో ఉద్యోగార్థులకు నిరాశ
- పడిపోతున్న నియామకాలు
- ఇప్పటికే నిలిపివేసిన పలు సంస్థలు
నవతెలంగాణ,వాణిజ్యవిభాగం: కేంద్ర ప్రభుత్వ అనాలోచిత బ్యాంకుల విలీన చర్యల వల్ల ఈ రంగంలో భారీగా ఉద్యోగ నియామకాలు పడిపోతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులను విలీనాల పేరుతో కుదించడానికి జరుగుతున్న ప్రక్రియ వల్ల అనేక బ్యాంకులు కొత్త నియామకాలను నిలిపివేశాయి. ఇప్పటికే ఎస్బీఐలో ఐదు అసోసియేట్ బ్యాంకుల విలీనం వల్ల ఆయా బ్యాంకుల్లో దాదాపుగా నియామకాలకు మంగళం పాడారు. ఇదే సమయంలో ఈ బ్యాంకుల్లో పని చేసే వారికి స్వచ్ఛంద విరమణ పథకాన్ని అమలు చేస్తున్నారు. ముఖ్యమైన సేవలకు గాను తప్పనిసరి అయితే తప్పా నియామకాలు చేపట్టడం లేదు.దేశంలోని 20 బ్యాంకులకు గాను నియామకాల పరీక్షలను నిర్వహించే ఇన్స్ట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (ఐబీపీఎస్) ఇప్పటికే ఈ ప్రభావానికి గురైంది. ఈ సంస్థ ప్రొబిషనరీ ఆఫీసర్లు, మేనేజ్మెంట్ ట్రైయినీ, క్లర్కుల కోసం కామన్గా పరీక్షలు నిర్వహిస్తుంది. 2018-19కి గాను నియామకాల కోసం ఈ ఏడాది చేపట్టే ప్రక్రియలో ఏడు బ్యాంకులు తమకు కొత్త నియామకాలు వద్దని సంకేతాలు ఇచ్చాయి. మరో నాలుగు బ్యాంకులు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని బిజినెస్ లైన్ దీనిపై ఒక కథనం వెల్లడించింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఓరియంటల్ బ్యాంకు ఆఫ్ కామర్స్, పంజాబ్ అండ్ సిందూ బ్యాంకు, యునైటెడ్ బ్యాంకు ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, సిండికేట్ బ్యాంకు, ఇండియన్ బ్యాంకు, ఐడీబీఐ బ్యాంకు, యుకో బ్యాంకు, విజయా బ్యాంకులు ఎలాంటి నియామకాల కోసం ముందుకు రావడం లేదని సమాచారం.
ప్రస్తుత ఏడాదిలో నియామకాలు తగ్గొచ్చని నేషనల్ స్కూల్ ఆఫ్ బ్యాంకింగ్ డైరెక్టర్ సీఎస్ వేప పేర్కొన్నారు. ఇందుకు కారణం ఇప్పటికే జరిగిన పలు బ్యాంకుల విలీనం, మరికొన్ని బ్యాంకుల విలీనంపై జరుగుతున్న ప్రక్రియనే కారణమన్నారు. వచ్చే రెండేండ్లలో కొత్త నియామకాల్లో 50 శాతం పతనం ఉంటుందని పంజాబ్ నేషనల్ బ్యాంక్కు చెందిన ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు. బ్యాంకుల వీలీనాల నేపథ్యంలో శాఖల కుదింపు, ఉద్యోగుల హేతుబద్దీకరణనే ఇందుకు కారణమన్నారు.
మూతపడ్డ 7000 శాఖలు..
స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో అసోసియేట్ బ్యాంకుల విలీనం వల్ల దాదాపుగా 7000 శాఖలు మూతపడ్డాయని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయిస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు. ఈ ప్రభావం క్లర్కు, ఆఫీసర్స్ పోస్టుల నియామకాలపై ప్రభావం చూపుతుందన్నారు. విలీనాల ప్రక్రియ తప్పకుండా ఉద్యోగ నియామకాలపై ప్రతికూల ప్రభావం చూపనుందన్నారు. ఎస్బీఐ గణంకాల ప్రకారం 2017-18 జూన్తో ముగిసిన తొలి త్రైమాసికం ముగింపు నాటికి ఆ బ్యాంకు శాఖలు 23,423కు తగ్గాయి. ఇంతక్రితం మార్చి ముగింపు నాటికి ఈ సంఖ్య 24,017గా ఉంది. 2016-17లో ఐబీపీఎస్ ప్రభుత్వ రంగ బ్యాంకుల కోసం నిర్వహించిన ఆఫీసర్ క్యాడర్ పోస్టుల పరీక్షల కోసం 19.67 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంతక్రితం ఏడాది ఇదే కాలంలో 15.76 లక్షల ఉద్యోగార్థులు ఐబీపీఎస్లో రిజిస్ట్రర్ చేసుకున్నారు. దీంతో పోల్చితే గతేడాది అభ్యర్థుల్లో 20 శాతం పెరుగుదల చోటు చేసుకుంది. కాగా క్లరికల్ జాబ్స్లో 20.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 2015-16లో ఈ సంఖ్య 19.26 లక్షలుగా ఉంది. దేశంలోని ప్రభుత్వ, ప్రయివేటు రంగ బ్యాంకుల్లో దాదాపుగా 13 లక్షల మంది పని చేస్తున్నారు.