Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత త్రైమాసికంలోనూ వృద్ధి ఆరు శాతానికి లోబడే..
- ద్వితీయ త్రైమాసికంలోనూ స్తబ్దతే
- 'సాగు' ముందుకు సాగడం లేదు
- తయారీ రంగంలోనూ నేల చూపులే..
- 3, 4 త్రైమాసికాల్లోనూ వృద్ధి అంతంతే: ఎస్బీఐ రీసెర్చ్ అధ్యయన నివేదిక
ముంబయి: దేశ ఆర్థిక వ్యవస్థలో వృద్ధి అనుకున్నంత ఆశాజనకంగా లేదని ఆర్థిక సంస్థల విశ్లేషణలు చెబుతున్నాయి. వృద్ధిలో దూసుకు పోతున్నామని పాలకులు చేస్తున్న ప్రకటనలకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి నమోదవుతూ వస్తోంది. దేశ వృద్ధి రేటు ఇంకా స్తబ్దతలోనే కొనసాగుతుందని ఎస్బీఐ రీసెర్చ్ సంస్థ ఒక అధ్యయన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం సెప్టెంబర్తో ముగియనున్న ద్వితీయ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6 శాతానికి లోపే నమోదు కావచ్చని తెలిపింది. ప్రధానంగా వ్యవసాయరంగం స్తబ్దత నెలకొని ఉందని పేర్కొంది. తయారీ రంగం పేలవ ప్రదర్శన, గనుల రంగం ఉత్పత్తిలో తగ్గుదల వృద్ధి రేటును దెబ్బతీయనున్నాయని తెలిపింది. ఆతిధ్యం, రవాణా, ప్రభుత్వ వ్యయం పద్దుల నుంచి మద్దతు లభించింది. ద్వితీయ త్రైమాసికంలో వీటి నుంచి కూడా మద్దతు అందకపోవచ్చని పేర్కొంది. ముఖ్యంగా వ్యవసాయ రంగం వృద్ధి రేటు స్తబ్దతలోనే కొనసాగవచ్చుని తెలిపింది.
జీఎస్టీ ప్రభావం ఉంది...
ఎస్బీఐ రీసెర్చ్ రిపోర్టు ప్రకారం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు కూడా వృద్ధి రేటుపై ప్రతికూల ప్రభావం చూపి ఉండొచ్చని విశ్లేషించింది. 2017-18 ఏప్రిల్-జూన్ కాలంలో వృద్ధి రేటు 5.7 శాతానికి పడిపోయి మూడేండ్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. కాగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలోనూ ఇదే స్థాయిలో వృద్ధి చోటు చేసుకోవచ్చని నివేదిక పేర్కొంది. ఈ ప్రభావం ఏడాది వృద్ధి రేటుపై తీవ్రతను చూపనుందని పేర్కొంది. వచ్చే మూడు, నాలుగు త్రైమాసికాల్లోనూ వృద్ధి రేటు 6.5 శాతం దరిదాపుల్లోనే ఉండొచ్చని పేర్కొంది.
పలు కీలక అంశాలు ప్రతికూలమే...
ద్వితీయ త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోవడానికి అనేక కారణాలున్నాయని ఈ రిపోర్టు విశ్లేషించింది. తొలి త్రైమాసికంలో ముఖ్యంగా వాణిజ్యం, తొలి మూడు మాసాల్లో అనేక ప్రాంతాల్లో వర్షాభావం పరిస్థితులు నెలకొన్నాయి. ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తి తగ్గనుంది. అదే విధంగా తయారీ, గనుల రంగాలు అంతంత మాత్రమే ప్రగతిని కనబర్చనున్నాయని తెలిపింది.
పడకేసిన పారిశ్రామికం..
ఇప్పటికే ప్రస్తుత ఏడాది జులైలో పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) గణంకాలు బలహీనంగా ఉన్నాయి. ముఖ్యంగా కన్జూమర్ డ్యూరెబుల్స్ ఉత్పత్తి సూచీ నిరాశను మిగిల్చింది. ప్రస్తుత ఏడాదిలో తొలుత ఎగుమతులు పుంజుకున్నప్పటికీ గత కొద్ది మాసాలుగా ఎగుమతులు కూడా వరుసగా పడిపోతున్నాయి. గత మే నుంచి ఇదే పరిస్థితి కనబడుతోంది. ఉదాహరణకు ఏప్రిల్ 2017 నుంచి జులై 2017 మధ్య అమెరికా టెక్స్టైల్ దిగుమతులు 30 శాతం మేర పెరిగాయి. కాని జులై సమయంలో అమెరికాకు భారత వస్త్ర ఎగుమతుల్లో పెద్ద పెరుగుదల లేదు. కాగా ఒక్క ఏప్రిల్లో మాత్రమే ఎగుమతులు కొంత ఆశాజనకంగా ఉన్నాయి. కాగా జూన్లో విలువ, సంఖ్యలోనూ తగ్గుదల చోటు చేసుకుంది. జీఎస్టీ లో నెలకొన్న అనిశ్చితి వల్ల బహుశా ఇలా జరిగి ఉంటుందని ఈ రిపోర్టు పేర్కొంది. ఈ ప్రభావం వచ్చే త్రైమాసికాలపై కూడా ఉండొచ్చు. మరోవైపు చిన్న తయారీదార్లపై ఈ ప్రభావం ఎక్కువగా ఉందని, ఈ రంగాల వారికి అధిక పెట్టుబడి అవసరాలు ఉంటాయని విశ్లేషించింది.