Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'సన్స్' హోదా మార్చేందుకు సన్నాహాలు
- సంస్థ ప్రయోజనాలకేనని సంస్థ వెల్లడి
- 'ప్రత్యర్థి'తో ముప్పనే 'టాటా' కొత్త ఎత్తుగడ!
- తీవ్రంగా ఆక్షేపించిన సైరస్ మిస్త్రీ వర్గం
- మైనార్టీ వాటాదారుల అణచివేతని ఆవేదన
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశీయ వ్యాపార దిగ్గజం టాటా గ్రూపులో సద్దుమణిగిందనుకున్న అంతర్గత విబేధాలు మళ్లీ తెరపైకి వచ్చాయి. టాటా గ్రూపు సంస్థల ప్రమోటర్ టాటా సన్స్ తన చట్టబద్ధమైన హోదాను ప్రస్తుతం ఉన్న పబ్లిక్ లిమిటెట్ నుంచి ప్రయివేటు లిమిటెడ్కు మార్చుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకుగాను ఈ నెల 21 నిర్వహించనున్న వార్షిక సర్వసభ్య సమావేశంలో వాటాదారుల సమ్మతి తీసుకోనున్నారు. టాటా సన్స్ను ప్రయివేటు లిమిటెడ్ కంపెనీగా మార్చేందుకు వీలుగా సంస్థ ఆర్టికల్ ఆఫ్ అసోసియేషన్లో మార్పులు తేనున్నామని అందుకు తమ సమ్మతినివ్వాలని వాటాదారులను కోరింది. దీనికి సంబంధించి కంపెనీ వాటాదారులకు నోటీసులను సైతం పంపింది. అయితే ఈ ప్రతిపాదనను ఇటీవలే చైర్మెన్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్రీ,్త అతని కుటుంబం తీవ్రంగా ఆక్షేపించింది.
కంపెనీ ప్రయోజనాలకే ఈ నిర్ణయం..
టాటా సంస్థలో తాజాగా గొడవకు కారణమైన పబ్లిక్-ప్రయివేటు రగడ గురించి టాటా సన్స్ తన వివరణనిచ్చింది. కంపెనీ మేటి ప్రయోజనాల నిమిత్తమే బోర్డు ప్రయివేటు లిమిటెడ్ ప్రతిపాదనను ఎత్తుకున్నట్టుగా టాటా సన్స్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం సంస్థ చట్టపరంగా 'డీమ్డ్ పబ్లిక్ కంపెనీ' హోదాను కలిగి ఉందని.. కొత్తగా అమలులోకి వచ్చిన కంపెనీల చట్టం-2013 ప్రకారం ఈ హోదాకు చట్టబద్ధత లేదని కంపెనీ వెల్లడించింది. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గాను తాము పబ్లిక్ లిమిటెడ్ నుంచి ప్రయివేటు లిమిటెడ్కు మారాలని అనుకుంటున్నట్టుగా కంపెనీ వార్గలు చెబుతున్నాయి.
మైనార్టీల వాటాదారుల అణచి వేత: మిస్త్రీ వర్గం
టాటా సన్స్ చట్టపరమైన హోదాను మార్చాలన్న ప్రతిపాదనలను ఇటీవలే చైర్మెన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ కుటుంబం వ్యతిరేకించింది. తమ అభ్యంతరాలను ఏకరువు పెడుతూ మిస్త్రీ కుంటుంబానికి సంబంధించిన సైరస్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ టాటా సన్స్ బోర్డుకు ఒక లేఖ రాసింది. ప్రయివేటు లిమిటెడ్ ప్రతిపాదన మైనార్టీ వాటాదారల ప్రయోజనాల అణచివేతేనని పేర్కొంది. తీవ్రంగా తన అభ్యంతరాన్ని వెల్లడించింది. టాటా ట్రస్టులో టాటా సన్స్ దాదాపు 66 శాతం మేర వాటాను కలిగి ఉంది. ఇటీవలే చైర్మెన్ హోదా నుంచి ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీ కుటుంబానికి దాదాపుగా 18.4 శాతం హోదా ఉంది. టాటా సన్స్ ప్రతిపాదనను తొందరపాటు చర్య అని.. దీనికి తోడు సంస్థలోని మెజార్టీ వాటాదారుల నిగూఢమైన ప్రయోజనాల కోసం ప్రయివేటు పాట ఎత్తుకుంటున్నారంటూ ఆక్షేపించింది. టాటా సంస్థల చైర్మెన్గా మిస్త్రీని అర్ధాంతరంగా తొలగించడంపై మిస్త్రీకి చెందిన సైరస్ ఇన్వెస్ట్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్, స్టెర్లింగ్ ఇన్వెష్ట్మెంట్ కార్పొరేషన్ సంస్థ నేషనల్ కంపెనీ లా ట్రైబ్యూనల్లో ఇప్పటికీ న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
అసలు కారణం అదేనా...
టాటా సన్స్ను పబ్లిక్ లిమిటెడ్ నుంచి ప్రయివేటు లిమిటెడ్కు మార్చాలన్న ప్రతిపాదన వెనుక అసలు మతలబు మరొకటి ఉన్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది టాటా సన్స్ మిస్త్రీని గ్రూపు చైర్మెన్ హోదా నుంచి అర్ధాంతరంగా దించేసింది. దీనిపై మిస్త్రీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. న్యాయపోరాటం కూడా చేస్తూన్నారు. ఇప్పుడు మిస్త్రీ స్థానంలో కొత్తగా చంద్రశేఖరన్ టాటా పగ్గాలు చేపట్టి.. సంస్థను తిరిగి పట్టాలెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మిస్త్రీ వర్గం తన మైనార్టీ వాటాతో టాటా సన్స్ను ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా రతన్ టాటా వర్గం భావిస్తోంది. టాటా సన్స్లో 18.3 శాతం వాటా ఉన్న మిస్త్రీ టాటాలను ఇబ్బంది పెట్టేందుకు గాను తన వాటాను.. ఇతర పోటీ సంస్థకు విక్రయించే ప్రమాదం ఉంది. అదే జరిగితే సంస్థకు దీర్ఘకాలంలో చాలా ఇబ్బందులు వస్తాయి. మిస్త్రీ వర్గం ఈ దిశగా పావులు కదుపుతున్నట్టు ఉప్పందిన నేపథ్యంలోనే టాటా సన్స్ ప్రయివేటు లిమిటెడ్ పాట అందుకున్నట్టు తెలుస్తోంది. ఒక్కసారి సంస్థ చట్టపరంగా ప్రయివేటు లిమిటెడ్కు మారిపోతే భారత కంపెనీల చట్టం ప్రకారం మిస్త్రీ కుటుంబం గంపగుత్తగా తన వాటాను ఇతరులకు (టాటా ప్రత్యర్థులకు) విక్రయించేందుకు వీలు లేకుండా పోతుంది. పలు ఆంక్షలు అమలులోకి వస్తాయి. దీంతో మిస్త్రీ ఎత్తులకు చెక్ పెట్టొచ్చు.. అందుకే టాటా సన్స్ కొత్త ఎత్తుగడతో కొత్త వివాదానాకి తెర లేపినట్టుగా సమాచారం.