Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అక్టోబరుకు బాగు చేయండి:జీవోఎం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విజయవంతంగా అమలు కాకుండా 'గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ నెట్వర్క్' (జీఎస్టీఎన్) నుంచి సమస్యలు ఎదురవుతున్నాయి. ఇటీవలి కాలంలో జీఎస్టీ ఆన్లైన్ వ్యవస్థ తరుచుగా మొరాయిస్తుండడంతో వ్యాపారుల్లో అసంతృప్తి మొదలవుతోందని జీఎస్టీఎన్ సమస్యల నివారణకై ఏర్పాటు చేసిన మంత్రుల బృందం (జీవోఎం) అభిప్రాయపడింది. బీహార్ ఉపముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఈ జీవోఎంలో మన రాష్ట్రం నుంచి ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, వాణిజ్య పన్నుల శాఖ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు కర్ణాటక, తమిళనాడులకు చెందిన మంత్రులు అధికారులు పాల్గొన్నారు. వ్యాపారస్తులు, వర్తకులు పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా జీఎస్టీపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్లో జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పలు రాష్ట్రాలు ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్థావించిన సంగతి తెలిసిందే. జీఎస్టీపై పెరుగుతున్న అసంతృప్తిని అర్ధం చేసుకున్న సర్కారు విషయాన్ని సీరియస్గా తీసుకుంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా జీఎస్టీఎన్ సమస్యల పరిష్కారానికిగాను మంత్రుల బృందాన్ని (జీవోఎం) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. జీవోఎం వివిధ సంస్థలు, రాష్ట్రాల పన్ను శాఖల అధికారుల, టాక్స్ కన్సెల్టెంట్స్తో మంతనాలను జరిపి కొన్ని సాధారణ సమస్యలను గుర్తించింది. ఎక్కువగా జీఎస్టీ ఫైలింగ్లోనే 70-80 శాతం మేర సమస్యలను వస్తున్నట్టుగా జీవోఎం గుర్తించింది. శనివారం ఇక్కడ జరిగిన మొదటి జీవోఎం సమావేశంలో జీవోఎం జీఎస్టీఎన్ను నిర్వహిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ ప్రతినిధులను పిలిచి తమ అసంతృప్తిని వెల్లడించింది. అక్టోబరు చివరి నాటికి జీఎస్టీఎన్ ద్వారా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరింది.ఇక నుంచి ప్రతి 15 రోజులకు ఒక మారు జీఎస్టీఎన్ను మేటిగా తీర్చిదిద్దడంతో పురగోతని జీవోఎం సమీక్షించనుంది. దీనికి తోడు జీఎస్టీ 3బీ ఫారమ్ను ఎడిటింగ్ చేసుకొనే వెసులుబాటును ఇవ్వాలని, రోజువారీ నివేదికలు రాష్ట్రాలకు చేరేలా చూడాలని.. ఎంఐఎస్ నివేదికలు పంపాలని.. హెల్ప్లైన్ను మరింత పటిష్టపరచాలని తెలంగాణ ఈ సమావేశంలో బలంగా కోరింది.