Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: మోడీ ప్రభుత్వం చేపట్టిన పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) విధానాలు వృద్ధి రేటును గణనీయంగా ప్రభావితం చేస్తున్నట్టుగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. నోట్లరద్దుతో పాటు ఇటీవల ఆగమేఘాలపై సర్కారు అమలులోకి తీసుకు వచ్చిన వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అసంఘటిత రంగాన్ని, చిన్న తరహా పరిశ్రమల రంగాన్ని బాగా ప్రభావితం చేయనున్నాయని ఆయన అన్నారు. సీఎన్బీసీ-టీవీ18కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశ జీడీపీలో దాదాపు 40 శాతం వాటా కలిగిన ఈ రెండు రంగాలపై జీఎస్టీ, నోట్లరద్దు ప్రభావం అధికంగా ఉండడం వల్ల వృద్ధి రేటులో క్షీణత నమోదు అవుతున్నట్టుగా ఆయన విశ్లేషించారు. సర్కారు తమ నిర్ణయాల కారణంగా ఏర్పడే సమస్యలను పూర్తిగా విశ్లేషించకుండా నోట్లరద్దు చేపట్టడం, జీఎస్టీని అమలులోకి తేవడాన్ని మన్మోహన్ తప్పుబట్టారు. ఇప్పుడు ఆ చర్యల కారణంగా ఏర్పడిన ప్రతికూల ఫలాలు నెమ్మదిగా ఒక్కొక్కటి బయటకు వస్తున్నట్టుగా మాజీ ప్రధాని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.9 శాతం నుంచి 5.7 శాతానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఇది మూడేండ్ల కనిష్టం కావడం విశేషం. మరోవైపు ద్వితీయ తైమాసికంలోనూ వృద్ధి రేటు 8 శాతం నుంచి 6.1 శాతానికి కుంగిన నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.