Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇష్యూ ధరల శ్రేణి రూ.685-700
న్యూఢిల్లీ: ప్రాథమిక మార్కెట్లో మరో భారీ పబ్లిక్ ఇష్యూకు నేటి (బుధవారం) నుంచి తెర లేవనుంది. దాదాపు రూ.8,400 కోట్ల (1.3 బిలియన్ డాలర్ల) మేర నిధుల సమీకరణ నిమిత్తం ఎస్బీఐ లైఫ్ సంస్థ బుధవారం ఐపీవోకు రానుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 35-40 శాతం వృద్ధిని ఆశిస్తున్న ఎస్బీఐ లైఫ్సంస్థ ఈ పబ్లిక్ ఇష్యూ ధరల శ్రేణిని షేరు ఒక్కింటికి రూ.685-700లుగా నిర్ణయించింది. బుధవారం (20న) ప్రారంభమయ్యే ఈ ఇష్యూ 22తో ముగియనుంది. దాదాపు ఏడు సంవత్సరాల తరువాత తొలిసారిగా ప్రాథమిక మార్కెట్లో బిలియన్ డాలర్ల నిధుల సమీకరణతో ఐపీవోకు వస్తున్న సంస్థ ఎస్బీఐ లైఫ్ కావడం విశేషం. ఈ ఇష్యూ నిమిత్తం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దాదాపు 8 శాతం మేర వాటాను (80 మిలియన్ల వాటాలను) విక్రయించనుంది. ఎస్బీఐ లైప్ సంస్థలో మరో ప్రధాన వాటాదారైన బీఎన్పీ పారిబస్ కార్డిఫ్ సంస్థ దాదాపు 4 శాతం మేర (40 మిలియన్ల వాటాలను) విక్రయించనుంది. 2.4 బిలియన్ డాలర్ల కోల్ ఇండియా ఇష్యూ తరువాత మళ్లీ బిలియన్ డాలర్లకు పైబడిన విలువతో మార్కెట్లోకి వస్తున్న ఇష్యూ ఎస్బీఐ లైఫ్.
ఐసీఐసీఐ లాంబర్డ్కు మూడు రెట్ల స్పందన
ఐసీఐసీఐ లాంబర్డ్ జనరల్ ఇన్సూరెన్స్ పబ్లిక్ ఇష్యూ మంగళవారంతో ముగిసింది. స్టాక్ ఎక్స్ఛేంజీల వద్ద అందుబాటులో ఉన్న కడపటి సమాచారం మేరకు ఇష్యూ ముగిసే సమయానికి ఈ ఐపీవోకు దాదాపు 2.98రెట్ల మేర స్పందన లభించింది. దాదాపు రూ.5,700 కోట్ల మేర నిధుల సమీకరణకు గాను ఐసీఐసీఐ లాంబర్డ్ ప్రాథమిక మార్కెట్లోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇష్యూ కింద దాదాపు 6,16,66,740 వాటాలను విక్రయానికి ఉంచగా దాదాపు 18,34,60,772 బిడ్లు లభిం చాయి. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారుల విభాగం నుంచి మంచి స్పందన లభించింది. ఈ విభాగంలో దాదాపు 8.17 రెట్లు, సంస్థాగతేతర విభాగంలో 83 శాతం రిటైల్ ఇన్వెష్టర్ల విభాగంలో 1.21 రెట్ల మేర స్పందన లభించినట్టుగా ఇన్వెష్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి.