Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: డొల్ల కంపెనీల పని పట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో భాగంగా డొల్ల కంపెనీలకు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న పలువురు ప్రముఖులతో పాటు 1,06,578 మందిపై అయిదు సంవత్సరాల పాటు అనర్హత వేటు వేసింది. డొల్ల కంపెనీల నిజాలను నిగ్గు తేల్చే పనిలో ఉన్న కార్పొరేట్ వ్యవహారాల శాఖ (సీఏఎం) అనర్హత వేటు వేసిన డైరెక్టర్ల జాబితాలో కేరళ మాజీ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ, ఆ రాష్ట్ర అసెంబ్లీ విపక్ష నేత రమేష్ చెన్నిత్తలతో పాటు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ప్రధాన అనుచరురాలుగా ఉండి ప్రస్తుతం జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళతో పాటు గల్ఫ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త ఎం.ఎ. యూసుఫ్ అలీ పేర్లు ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఉత్తుత్తి కంపెనీల ద్వారా భారీగా ఆర్థిక అక్రమాలతో పాటు మనీ ల్యాండరింగ్ జరుగుతున్నట్టుగా అనుమానిస్తున్న సర్కారు దాదాపు రెండు లక్షల డొల్ల కంపెనీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన సంగతి తెలిసిందే. దీనికి తోడు డొల్ల కంపెనీ అక్రమ లావాదేవీల్లో చురుగ్గా పాల్గొన్న చార్టర్డ్ అకౌంటెట్లు, కంపెనీ సెక్రెటరీలను సీఏఎం గుర్తించి వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా ఐసీఏఐ, ఐసీఎస్ఐలను కోరింది. వేటు పడిన డైరెక్టర్ల పాత్రతో పాటు డొల్ల కంపెనీల లావాదేవీల్లో నిజాలను నిగ్గు తేల్చేందుకు గాను సీఏఎం సీరియస్ ఫ్రాడ్ ఇన్వెష్టిగేషన్ ఆఫీస్, రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీలు, బ్యాంక్ల అసోసియేషన్తో కూడా కలిసి పని చేస్తోంది.