Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: కాల్ టర్మినేషన్ చార్జీలను సగానికి పైగా తగ్గించాలన్న ట్రారు ఆదేశాలతో బుధవారం టెల్కోల షేర్లను తీవ్ర ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రా ట్రేడింగ్లో భారతీ ఎయిర్టెల్ షేర్ ఏకంగా 6.2 శాతం మేర పడిపోయినప్పటికీ తుదకు స్వల్ప లాభంతో ముగిసింది. కాగా ఐడియా 3.43 శాతం, రిలయన్స్ సూచీ 1.74 శాతం చొప్పున నష్టాన్ని చవి చూశాయి. ఇంట్రా ట్రేడింగ్ ఈ సూచీలు వరుసగా 7.4 శాతం, 4.2 శాతం చొప్పున విలువ కోల్పోయాయి. ఎయిర్టెల్ చివరకు 0.39 శాతం పెరిగి రూ.396.25 వద్ద ముగిసింది. మరోవైపు రిలయన్స్ ఇండిస్టీస్ లిమిటెడ్ షేర్ మాత్రం దూసుకుపోయింది. ఓ దశలో రికార్డు స్థాయిలో 3.8 శాతం పెరిగిన రిల్ షేర్ తుదకు 0.85 శాతం లాభంతో రూ.847.10 వద్ద నమోదయ్యింది. కాల్ టర్మినేషన్ ఛార్జీలను 14 పైసల నుంచి 6 పైసలకు తగ్గిస్తూ టెలికాం రెగ్యులేటరీ ట్రారు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రంగం షేర్లు ప్రభావితం అయ్యాయి. ఒక నెట్ వర్క్ నుంచి వచ్చిన కాల్కు తన నెట్వర్క్ పరిధిలో అనుసంధానం కల్పించినందుకు వసూలు చేసే చార్జీ ఇది. వచ్చే అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త చార్జీలు అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల ప్రస్తుత టెల్కోల ఆదాయం పడిపోనుంది. వచ్చే 2020 నుంచి ఈ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉంది.
మార్కెట్లు యథాతథం
అమెరికా ఫెడరల్ రిజర్వు పాలసీ నిర్ణయాలు వెల్లడి కానున్న నేపథ్యంలో బుధవారం మదుపర్లు ఆచితూచి ట్రేడింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో మార్కెట్లు ముగిసే సమయానికి కూడా సూచీలు యథాతథ స్థానాల వద్దే ముగిశాయి. బుధవారం బీఎస్ఈ సెన్సెక్స్ 1.86 పాయింట్లు తగ్గి 32,400.51 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.4 పాయింట్లు కోల్పోయి 10,141.15 పాయింట్ల వద్ద నమోదయ్యింది. బీఎస్ఈలో రంగాల వారిగా క్యాపిటల్ గూడ్స్ 0.54 శాతం, వైద్యం 0.23 శాతం, ఎఫ్ఎంసీజీ 0.15 శాతం, మౌలిక వసతులు 0.04 శాతం చొప్పున రాణించి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు ఆటో సూచీ 0.69 శాతం, కన్జూమర్ డ్యూరెబల్స్ 0.66 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.42 శాతం, విద్యుత్ 0.35 శాతం చొప్పున నష్టపోయాయి. సెన్సెక్స్లో డాక్టర్ రెడ్డీస్ 3.33 శాతం, టాటా స్టీల్ 1.64 శాతం, ఐటీసీ 1.27 శాతం, ఎస్బీఐ 1.03 శాతం, విప్రో 0.99 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి.