Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వివిధ చర్యలతో ఆర్థిక వ్యవస్థలో జోష్ నింపే ప్రయత్నం చేస్తాం
- పెరుగుతున్న పెట్రోలు భారం మేము మోయలేము!
- అమెరికాలో తుఫాను వల్లే పెట్రో ధరలు పెరిగాయి
- రాష్ట్ర ప్రభుత్వాలు తమ సెస్ మోత తగ్గించుకోవాలి
- ప్రస్తుతం ద్రవ్యోల్బణమేమీ ఆందోళనకరంగా లేదు
- వ్యాపారుల ధోరణి వల్లే జీఎస్టీ దాఖలులో సమస్యలు: మీడియా సమావేశంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ
న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) అమలు తదితర సంస్కరణల కారణంగా ఆర్థిక వ్యవస్థ మందగించడంతో సర్కారు డెఫెన్స్లో పడింది. తాజాగా వృద్ధి రేటు మూడేండ్ల కనిష్టానికి దిగజారి 5.7 శాతానికి చేరడం, వినియోగదారు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం ఒక శాతం మేర పెరిగి 3.36 శాతానికి పెరగడంతో పాటు పారిశ్రామికోత్పతి సూచీ కూడా నేల చూపులు చూస్తుండంతో సర్కారు మేలుకొంది. పరిస్థితిని సమీక్షించేందుకు గాను మంగళవారం రాత్రి ఆర్థిక మంత్రి జైట్లీ నేతృత్వంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రైల్వే మంత్రి పీయూష్ గోయెల్, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభు, ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింగ్ సుబ్రహ్మణ్యన్ ఆర్థిక శాఖ కార్యదర్శులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ఆర్థిక వ్యవస్థలో తిరిగో జోష్ నింపేందుకు గాను పలు ఉద్దీపన చర్యలను చేపట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం.
పలు చర్యలను ప్రకటిస్తాం..
ఆర్థిక వ్యవస్థను తిరిగి పరుగులు పెట్టించేందుకు గాను అవసరమైన అన్ని ఉద్దీపన చర్యలను చేపట్టాలని తాము యోచిస్తున్నట్టుగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. బుధవారం ఆయన కేంద్ర క్యాబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రధాన మంత్రితో చర్చించాకే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేలా తాము తీసుకోనున్న పలు ఉద్దీపన చర్యలను బయటకు వెల్లడిస్తామని తెలిపారు. ఆర్థిక వ్యవస్థలోని సూక్ష్మ గణాంకాల పనితీరును తాము సమీక్షించామని జైట్లీ తెలిపారు. సంస్కరణల ఎజెండా అమలులో తమ ప్రభుత్వం చురుగ్గా ముందుకు సాగుతుందని వివరించారు. గత రెండు రోజులుగా తాము ఆర్థిక మంత్రుత్వ శాఖకు చెందిన అధికారులతో వరుసగా మంతనాలు జరిపినట్టుగా తెలిపారు.
తుఫాను కారణంగానే పెట్రో మంట..
అంతర్జాతీయంగా సరఫరాలో ఏర్పడిన అవాంతరాల కారణంగానే డిమాండ్కు ఉత్పత్తికి మధ్య అంతరం పెరిగి పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతున్నట్టుగా ఆర్థిక మంత్రి జైట్లీ వివరించారు. ప్రధానంగ అమెరికా తీరంలో ఏర్పడిన హరికేన్ ఇందుకు కారణమని అన్నారు. ధరలు తగ్గించేందుకు తాము ఎలాంటి చర్యలు చేపట్టే యోచన లేదని అన్నారు. సాంఘీక సంక్షేమ పథకాల అమలునకు వ్యయం చేయాల్సి ఉన్నందున తాము పెట్రో ధరల భారాన్ని మోయలేమని తేల్చి చెప్పారు.
ద్రవ్యోల్బణం పెరుగుదల సాధారణమే..
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుదలకు కూడా జైట్లీ తనదైన రీతిలో సమాధానం ఇచ్చారు. వర్షాకాలంలో కూరగాయల ధరలు పెరగడం సాధారణ అంశమేనని అన్నారు. ద్రోవ్యల్బణం రెండంకెల స్థాయిలో ఉన్నప్పుడు నోరు మెదపని పార్టీలు ఇప్పుడు 3.3 శాతానికి చేరుకోగానే గగ్గోలు పెడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) విశేషంగా కృషి చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు.
జీఎస్టీ సమస్యలు స్వయంకృతాపరాధాలే..
కొత్తగా అందుబాటులోకి వచ్చిన జీఎస్టీ రిటర్నుల దాఖలులో సమస్యలు వచ్చి వర్తకులు ఇబ్బంది పడుతుండడాన్ని ఆర్థిక మంత్రి వ్యాపారుల స్వయంకృతాపరాధమని తేల్చేశారు. వ్యాపారులు గడువు తేది చివరి నిమిషం వరకు వేచి చూసే ధోరణి కారణంగానే చివరి నిమిషంలో రద్దీ ఏర్పడి నెట్వర్క్ డౌన్ అవుతున్నట్టుగా జైట్లీ తెలిపారు. అందుకు ఆయన జులై రిటర్నుల దాఖలులో వర్తకులు వ్యవహరిస్తున్న తీరును ఉదహరించారు. జులై రిటర్నుల దాఖలునకు బుధవారం చివరి తేదీ అయినప్పటికీ ఇంకా కేవలం 25% మంది మాత్రమే రిటర్నులను దాఖలు చేసినట్టుగా వివరించారు. మిగతా 75 శాతం మంది చివరి నిమిషపు రిటర్నులకు ప్రయత్నింస్తుండడం వల్ల సమస్యలు తలెత్తుతున్నట్టు గా తెలిపారు.