Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక వ్యవస్థలో ప్రమాద ఘంటికలు..
- అంతా అద్భుతమన్న వారి నోట.. ఉద్దీపనల మాట..
- సంస్కరణలపై ఆత్మ పరిశీలనలో ప్రభుత్వ వర్గాలు!
- నోట్ల రద్దు, జీఎస్టీపై మరింతగా పెరుగుతోన్న అసహనం
- ప్యాకేజీలపై అధికారుల లీకులు.. మౌనం వీడని ప్రధాని..
- ఉద్దీపనతో ఒరిగేదేమీ లేదంటున్న నిపుణులు
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: తాము చేపట్టిన సంస్కరణల కారణంగా దేశం వృద్ధి పథంలో దూసుకుపోతోందని గొప్పలు చెప్పిన సర్కారు.. ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు ఎదరువుతుండడంతో డెఫెన్స్లో పడినట్టు కనిపిస్తోంది. దేశ వృద్ధి రేటుతో సహా కీలక సూక్ష్మ ఆర్థిక గణాంకాల్లో ప్రమాద ఘంటికలు మోగుతుండడం మోడీ సర్కారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, వాణిజ్య మంత్రి సురేష్ ప్రభుతో పాటు రైల్వే మంత్రి పీయూష్ గోయెల్లు దేశ ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించే విషయమై తీవ్ర మంతనాలు జరుపుతున్నారు. ఆర్థిక మంత్రి స్వయంగా రంగంలోకి దిగి రెవెన్యూ శాఖ, ఆర్థిక సేవల శాఖ, ఆర్థిక శాఖ అధికారులతో రోజుల కొద్ది వివిధ అంశాలపై అంతర్గత సమీక్షలు జరుపుతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే వెల్లడించారు. చక్కగా వృద్ధి పథంలో సాగుతున్న ఆర్థిక వ్యవస్థలో ముందస్తు సన్నద్ధత, ప్రణాళిక లేకుండా చేపట్టిన పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి సంస్కరణల కారణంగా వృద్ధికి విఘాతం కలిగినట్టుగా ఆర్థిక శాఖలో కొన్ని వర్గాలు లోలోన మదన పడుతున్నట్టు సమాచారం. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాము పడ్డ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైందన్న భావన సర్కారులోని కొన్ని వర్గాల్లో చాలా కనిపిస్తోంది.
ప్రణబ్ తరహా ప్యాకేజీతో లాభం లేదు..
ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఉద్దీపనల దిశగా యోచిస్తుండడంతో.. సంస్కరణలు ప్రతికూల ఫలితాలను ఇస్తున్నట్టు సర్కారే పరోక్షంగా ఒప్పుకున్నట్టయింది. స్వయంగా ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీయే మీడియా ముందుకు వచ్చి ఆర్థిక వ్యవస్థకు కొత్త జోష్ నింపేందుకు త్వరలోనే ఉద్దీపన ప్యాకేజీని తేనున్నట్టుగా ప్రకటించారు. మూలాలను బలోపేతం చేయకుండా ప్రభుత్వం ప్రకటించే ప్యాకేజీలతో ఆర్థిక వ్యవస్థకు పెద్దగా ఒరిగేదేమీ లేదని నిపుణులు చెబుతున్నారు. గత చరిత్ర కూడా ఇదే విషయాన్ని వివరిస్తుందని వారు అంటున్నారు. 2008లో ఏర్పడిన మందగమనం నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించేందుకు అప్పటి ఆర్థిక మంత్రి ప్రణబ్ తెచ్చిన ఉద్దీపన చర్యలతో పెద్దగా ఒరిగిందేమీ లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు మోడీ సర్కారు కూడా ఈ దిశగా అడుగులు వేసేటప్పుడు ఆచితూచి ముందుకు సాగాలని విశ్లేషకులు చెబుతున్నారు. 2008లో ప్రణబ్ ముఖర్జీ ప్రకటించిన ఉద్దీపనల కారణంగా ఆర్థిక వ్యవస్థకు లాభం కన్నా కూడా నష్టమే ఎక్కువగా జరిగిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. వృద్ధి మూడేండ్ల కనిష్టానికి పడిపోయి 5.7 శాతంగా నమోదు కావడం, ఆర్థిక వ్యవస్థలో నగదు లభ్యత తగ్గడం, జీఎస్టీపై స్పష్టత లేక తయారీదారులు ఉత్పత్తిని నిలిపివేసి స్టాక్ క్లియరింగ్పై దృష్టి సారించడంతో పాటు ద్రవ్యోల్బణం పెరగడం, కరెంటు ఖాతా లోటు పెరగడం వంటి అంశాలు సర్కారును కలవర పెడుతున్నాయి. దీంతో ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులు నెలకొన్నాయి. దీనికి తోడు జీఎస్టీ మొదటి నెల పన్ను వసూళ్లు అంచనా కట్టిన దానికంటే దాదాపు సగానికి పడిపోవడం కూడా సర్కారుకు ఇబ్బందికరంగా మారింది.
రూ.50,000 కోట్ల ఉద్దీపన వ్యయం!
ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమన పరిస్థితులను పారద్రోలి వృద్ధిని పరుగులు పెట్టించేందుకు గాను ప్రభుత్వం చురుగ్గా వ్యవహరించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.50,000 కోట్ల మేర ఉద్దీపన వ్యయం చేయాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు అధికారులు ఈ విషయాన్ని వెల్లడించినట్టు రాయిటర్స్ ఒక కథనంలో పేర్కొంది. ప్రభుత్వం ఆదాయ, వ్యయాలకు మధ్య ద్రవ్యలోటు అంతకంతకు పెరిగిపోతుండడం సర్కారుకు ఇబ్బందికరంగా మారింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటును 3 శాతానికి తగ్గించాలన్న తమ లక్ష్యాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేసుకుంది. ఆర్థిక వ్యవస్థకు దన్నునిచ్చే క్రమంలో ప్రకటించనున్న ఉద్దీపన ప్యాకేజీలో ప్రధానంగా ఎగుమతులు, ఎంఎస్ఎంఈ. బ్యాంకుల మూలధనీకరణ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నట్టుగా తెలుస్తోంది. జీఎస్టీతో పన్ను ఆదాయం బలహీనపడడం, ప్రయివేటు పెట్టుబడుల్లో స్తబ్దత నెలకొన్న నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలో మందగమన పరిస్థితులను పారద్రోలేందుకు సర్కారే ఉద్దీపన రూపంలో సమాయత్తమవుతున్నట్టుగా ఆ కథనం పేర్కొంది.