Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: నిరర్థక ఆస్తులతో కునారిల్లుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధనీకరణ అంశాన్ని పరిశీలిస్తునే.. వీలున్న చోట విత్త సంస్థల విలీనాల్ని సర్కారు పరిశీలిస్తోంది. ఇందులో భాగంగా మధ్యశ్రేణి బ్యాంకులైన విజయ బ్యాంక్, దేనా బ్యాంకుల విలీనం దిశగా ప్రోత్సహిస్తున్నట్టు సమాచారం. రెండు బ్యాంకుల విలీనానికి గాను ఆయా బ్యాంకుల బోర్డులు చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం. చర్చల్లో భాగంగా విలీనానికి అనుకూల, ప్రతికూల అంశాలను ఆయా బ్యాంకుల బోర్డులు సమీక్షిస్తున్నాయి. విజయ బ్యాంకు దక్షిణ భారత దేశంలో బలంగా ఉంది. మరోవైపు దేనా బ్యాంకు మహారాష్ట్ర దాని పరిసర రాష్ట్రాల్లో కార్యకలాపాలు సాగిస్తోంది. వీలినం వల్ల రెండు బ్యాంకులు తమ భౌగోళిక విస్తృతిని మరింతగా పెంచుకొనేందుకు వీలు పడనుంది. చర్చలు ఫలప్రదమైతే దక్షిణ, పశ్చిమ భారతంలో విలీన సంస్థ బలమైన మధ్యశ్రేణి బ్యాంకుగా అవతరించనుంది. జూన్తో ముగిసిన త్రైమాసికానికి విజయ బ్యాంకు 57 శాతం వృద్దితో రూ.255 కోట్ల లాభాన్ని ప్రకటించింది. ఈ బ్యాంకు నిరర్థక ఆస్తులు కూడా 7.3% మేరనే ఉన్నాయి. మరోవైపు దేనా బ్యాంకు తమ నష్టాలను తగ్గించుకొని రూ.133 కోట్లకు తగ్గించుకుంది. దీనికి తోడు ఎన్పీఏలు కూడా 17.37 శాతంగా ఉన్నాయి. దేనా బ్యాంకు ప్రస్తుతం ఆర్బీఐ చేపట్టిన దిద్దుబాటు ప్రక్రియలో ఉంది. ఎన్పీఏలు అధికంగా ఉన్న దేనా బ్యాంకునకు ప్రభుత్వం చేపట్టిన బ్యాంకుల మూలధనీకరణ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ మొత్తంలో సాయం అందే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశంపై ఆశలతోనే రెండు బ్యాంకుల విలీనపు చర్చలు చురుగ్గా ముందుకు సాగుతున్నట్టుగా అభిజ్ఞ వర్గాలు వెల్లడిస్తున్నాయి.