Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: మారుతీ వ్యాగన్ఆర్ కారు 18వ పడిలోకి అడుగు పెట్టింది. 1999లో మారుతీ సుజుకీ ఈ కారును మార్కెట్లోకి తీసుకు వచ్చింది. విడుదలైన సంవత్సరం నుంచి సంస్థకు అత్యధికంగా విక్రయాలుండే బ్రాండ్లలో ఒకటిగా ఈ కారు రికార్డులో ఉంటూ వస్తోంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కంపెనీ మొత్తం 20 లక్షలకు పైగా వ్యాగన్ఆర్ వాహనాలను విక్రయించింది. మారుతీ-800, ఆల్టో తరువాత అత్యధికంగా అమ్ముడై 20 లక్షల మార్కును దాటిన వాహనంగా వ్యాగన్ఆర్ రికార్డుకెక్కింది. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కొత్త మోడల్ కార్లు అయిదేండ్ల కంటే ఎక్కువ కాలం నిలదొక్కుకోవడం పెద్ద సమస్యగా మారినప్పటికీ వ్యాగన్ఆర్ మాత్రం 18 ఏండ్లుగా తన సత్తా చాటుతూనే వస్తోంది. మంచి విక్రయాల నేపథ్యంలో కంపెనీ ఇప్పటికీ ఈ కారులో పలు చిన్నచిన్న మార్పులతో పాటు అవసరం మేరకు పలు మేజర్ మార్పులను చేసింది. అయితే రానున్న రోజుల్లో ఇదే ప్లాట్ఫాంపై అత్యాధునిక వ్యాగన్ఆర్ను అందించేలా కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. వినియోగదారుల ఆదరణ నేపథ్యంలో కొత్త రూపులో వ్యాగన్ఆర్ను మార్కెట్లోకి తేవాలన్నది కంపెనీ లక్ష్యమని తెలుస్తోంది.