Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వృద్ధి రేటు మందగించి సూక్ష్మ గణాంకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న నేపథ్యంలో సర్కారు తీసుకొనే ఉద్దీపన నిర్ణయాలపై సర్వత్రా ఆసక్తి కనబడుతోంది. అయితే ఒత్తిడిలో ఉన్న ప్రభుత్వం తాను నిర్ధేశించుకున్న ఆర్థిక స్థిరీకరణ మార్గంలో ఎలాంటి మార్పులకు దిగినా అది ఆర్థిక వ్యవస్థకు చేటు చేకూర్చగలదని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుత ఒత్తిడిలో ప్రభుత్వం పట్టువిడుపు మార్గంలోకి వెళితే అంతర్జాతీయంగా పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బ తింటుందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజ సంస్థ యూబీఎస్ తన తాజా నివేదికలో పేర్కొంది. కేవలం భారత్ మెరుగైన వృద్ధితో దూసుకుపోవడం ఒక్కటే చూసి ప్రపంచ పెట్టుబడిదారులు భారత్ వైపు మొగ్గు చూపడం లేదని.. ద్రవ్యోల్బణం తగ్గడం, స్థిరమైన కరెన్సీ తదితర సూక్ష్మ గణాంకాలను కూడా పరిగణనలోకి తీసుకొని వారు ఇండియా వైపు దృష్టి సారిస్తున్నారని యూబీఎస్ పేర్కొంది. ఇప్పుడు సూక్ష్మ గణాంకాలు బలహీన పడుతుండంతో పెట్టుబడిదారుల సెంటిమెంట్ దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా నివేదిక పేర్కొంది. వృద్ధిని పునరుద్ధరించేందుకు భారత సర్కారు వ్యవస్థకు మరింతగా ఆర్థిక దన్నును ఇవ్వాలని సూచించింది. సర్కారు వ్యయంలో నాణ్యత పెంచడం, పెట్టుబడులు తదితర చర్యల వల్ల మేలు జరగగలదని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నిర్ధేశించుకున్న మేరకు ద్రవ్యలోటును 3.2 శాతానికి తీసుకు వచ్చేందుకు సర్కారు ఇప్పటికే ఆపసోపాలు పడుతున్నట్టుగా పేర్కొంది.